ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివారం నాడు ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో నందా దేవి హిమానీనదంలో పెద్ద స్థాయిలో మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో ధౌలిగంగా, రిషిగంగా, అలకనందకు నదులకు ఒక్కసారిగా వరదనీరు ప్రవాహం పెరిగిపోయింది. ధౌలిగంగాలో వచ్చిన వరద ఉద్ధృతితో ఆ నది ఒడ్డున ఉన్న ఎన్టీపీసీకి చెందిన తపోవన్-విష్ణుగఢ్ జల విద్యుత్ కేంద్రంలోకి నీరు చేరుకుంది. అక్కడ పనిచేస్తున్న వారితో సహా మొత్తం 203 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఐటీబీపీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కాగా ఇప్పటివరకు 19 మృతదేహాలు లభ్యమయ్యాయి.
మరోవైపు తపోవన్ జల విద్యుత్ కేంద్రం వద్ద టన్నెల్ లో చిక్కుకున్న 16 మందిని ఐటీబీపీ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గల్లంతు అయినవారికోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. ధౌలిగంగా పరీవాహక గ్రామాల్లో కొన్ని చోట్ల ఇళ్లు కూడా కొట్టుకుపోవడంతో అక్కడి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ధాటికి ధౌలిగంగా, రిషిగంగా నదులు కలిసే రేణి గ్రామంలో ఉన్న ఓ 12.3 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం, ఓ వంతెన కూడా కొట్టుకుపోయాయి.
ఉత్తరాఖండ్ లో చోటు చేసుకున్న ఆకస్మిక వరద విపత్తుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్టు ప్రకటించారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి మరో రూ.2 లక్షలను అందజేయనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ