నిత్యం రాజకీయాలు, ప్రభుత్వం పాలన విషయాల్లో తలమునకలయ్యే ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇటీవల ఒక ప్రతిపాదన చేశారు. ఆంధ్రప్రదేశ్కు సైతం ఒక ఐపీఎల్ జట్టు ఉంటే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన చేశారు. ఈ క్రమంలో రాష్ట్రానికి ఒక ఫ్రాంచైజ్ ఉండాలని సంకల్పించారు. వెంటనే సంబంధిత క్రీడాధికారులకు దీనిపై కసరత్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక అప్పటి నుంచి జగన్ సర్కార్, ఆంధ్ర క్రికెట్ ఆసోసియేషన్ ఐపీఎల్లో ఏపీ టీమ్ ఎంట్రీ ఇవ్వడంపై దృష్టిపెట్టారు. అయితే ఆ జట్టును ఎవరు కొనుగోలు చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్కు మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం విపరీతమైన ఆదరణ ఉంది. ఏటికేడు ఐపీఎల్ను చూసే వీక్షకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 15 ఐపీఎల్ సీజన్లు విజయవంతగా ముగిశాయి. తొలుత 8 జట్లతో ప్రారంభమైన ఈ మెగా టోర్నీ.. ప్రస్తుతం పది టీమ్లతో విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. గతేడాది గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రాకతో ఐపీఎల్ మరింత రంజుగా మారింది. అయితే ఐపీఎల్లో పాల్గొనే టీమ్ల సంఖ్య మరింత పెంచాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా ఒక ఫ్రాంచైజీకి అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ప్రతి ఏడాదీ ఐపీఎల్ కోసం కొత్త ఫ్రాంచైజీలకు బోర్డు అవకాశమిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో జరిగే బిడ్డింగ్లో పాల్గొని.. ఒక టీమ్ను దక్కించుకునే దిశగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కసరత్తులు చేస్తోంది. అందుకు సంబంధించి ఏసీఏ ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఆటగాళ్లకు ప్రాక్టీస్ వసతులతోపాటు అన్ని రకాల సౌకర్యాలు సిద్ధం చేసుకోవాలని ఏసీఏకు సీఎం జగన్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ పేరుతో సన్ రైజర్స్ టీమ్ ఒక్కటే ఐపీఎల్లో కొనసాగుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీమ్ ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ దిశగా కీలక ప్రతిపాదనలతో సిద్దం అవుతున్నారు. రాష్ట్రం నుంచి ఒక టీమ్ ఐపీఎల్లో ఉండేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీని వెనుక ఒక ఆసక్తి కర చర్చ పొలిటికల్, క్రికెట్ ఫ్యాన్స్లో మొదలైంది. మెగా హీరో రామ్ చరణ్ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ వేలం సమయానికి ఒక టీమ్ను కొనుగోలు చేసి ఫ్రాంచైజీగా మారాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ పేరుతో ఆ టీమ్ను ఐపీఎల్ బరిలోకి దిగే యోచనలో చెర్రీ ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ చర్చ ప్రతిపాదన దశలోనే ఉంది. ఇటీవల టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడుతో పాటు సీఎస్కే మేనేజ్మెంట్ సభ్యులు సీఎం జగన్ను కలిశారు. ఆ తరువాత కేఎస్ భరత్ కూడా సమావేశం అయ్యారు. యువతను ఆకట్టుకొనేలా క్రీడా పరమైన నిర్ణయాలు ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఏపీ నుంచి ఒక ఐపీఎల్ టీమ్ సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం నేరుగా ఐపీఎల్ టీమ్ నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి హీరో రామ్ చరణ్ తన ఐపీఎల్ టీమ్ ఏర్పాటుకు ముందుకొస్తే పూర్తిగా సహకరించేందుకు సీఎం జగన్ సిద్దంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చారని క్రీడా వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు సీఎస్కే, ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్లతో సీఎం జగన్కు సత్సంబంధాలు ఉన్నాయి. ఏపీ నుంచి కొత్త ఐపీఎల్ టీమ్ ఏర్పాటులో ఆ రెండు యాజమన్యాల సహకారం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు.
ఇక ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు సీఎం ఆలోచనలకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జట్టు కూర్పు, ఆర్థిక వ్యవహారాలు, నిర్వహణ వంటి వాటిపైన ప్రాజెక్టులతో సిద్ధం అవుతున్నట్లు క్రీడావర్గాలు భావిస్తున్నాయి. మెగా హీరో రామ్ చరణ్ ముందుకు వస్తే పూర్తి సహకారం అందించటానికి సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగేతే ఏపీ టీమ్కి బ్రాండ్తోపాటు ఇమేజ్ కూడా పెరుగుతాయని లెక్కలు వేస్తున్నారు. ఇక అంతా అనుకున్నట్లే సవ్యంగా జరిగితే.. వైజాగ్ వారియర్స్ పేరుతో రాష్ట్రం నుంచి మన టీమ్ ఐపీఎల్లోకి అడుగు పెట్టనుంది. అలాగే పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం ఏపీ జట్టుగా హోమ్ గ్రౌండ్గా మారనుంది.