అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఎలాగున్నా.. సమయం సమీపించాక కాంగ్రెస్ అధినాయకులందరూ ఒకేతాటిపైకి వచ్చారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు. గెలిచాక ఎవరి మనసులో ఏమున్నా.. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా బలపరిచి.. అధిష్ఠానం నిర్ణయం శిరోధార్యం అన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అందరూ హేమాహేమీలే. వారంతా సీఎం రేసులో ఉన్నామని ప్రకటించిన వారు. వారంతా సీఎం పదవికి తమకు అన్ని అర్హతలూ ఉన్నాయన్న వారు. వారంతా కడదాకా సీఎం కుర్చీకోసం ప్రయత్నించిన వారు. ఆ అవకాశం రాలేదు. దానికి పరిహారంగా కాబోలు ఇప్పుడు తమ కుటుంబం నుంచి మరొకరికి ఢిల్లీ సభలో సీటు కావాలంటున్నారు. సీట్ల కేటాయింపులో అధిష్ఠానం తీసుకునే నిర్ణయం తర్వాత ఎటువంటి లుకలుకలు బయటపడతాయో అనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది.
అధికార పార్టీ కావడంతో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల టిక్కెట్ కోసం పార్టీలో భారీ డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినందున కాబోలు లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ హవా వీస్తుందనే ఆశతోనూ చాలామంది టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. పది కాదు.. వంద కాదు.. ఏకంగా 306 దరఖాస్తులందాయి. ఉన్నది 17 లోక్సభ స్థానాలు. వాటికోసం ఈ దరఖాస్తుల్నుంచి అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి. అందుకు గాను వడపోత కార్యక్రమానికి పార్టీ సిద్ధమైంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం వాస్తవానికి రేపు జరగనుంది. రేవంత్ జార్కంఢ్ వెళ్లిన నేపథ్యంలో దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్మున్షీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీశ్చౌదరితో పాటు పలువురు సీనియర్లు హాజరు కానున్నారు.
ఎన్నికల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన కార్యాచరణతో పాటు టిక్కెట్లు కోరుతూ అందిన దరఖాస్తుల స్క్రూటినీ చేపట్టనున్నారు. స్క్రూటినీలో భాగంగా వడపోతలు జరిపి నియోజకవర్గానికి మూడు పేర్ల వంతున ఏఐసీసీకి పంపనున్నట్లు సమాచారం. అక్కడ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అక్కడ పరిశీలనలో అభ్యర్థులు ఖరారు కానున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారిలో సీఎం సీటుకు పోటీపడిన వారి వారసులనుంచి సీనియర్లకు చెందిన కుటుంబీకులెందరో ఉన్నారు. వారిలో ఎవరిని అదృష్టం వరించనుందో ఈనెల 15వ తేదీ తర్వాత తెలిసే అవకాశముంది.
అలాంటి వారిలో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క భార్య, రెవెన్యూ మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేని ప్రసాద్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్రావులున్నారు. వీరితోపాటు సీఎం పదవికి తామేమీ తక్కువకాదని భావించిన మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హన్మంతరావు కూడా వీరే ఉన్నారు. ఇంకా పార్టీ నేతలు జె.కుసుమ్కుమార్, పి. నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. = బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్న కుమార్తె రమ్యారావు కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.అసెంబ్లీ టిక్కెట్ కోసం కూడా ఆమె దరఖాస్తుచేసుకున్నా అది రాకపోవడంతో తిరిగి ఇప్పుడు ఎంపీ టిక్కెట్ కోసం ఆశపడుతున్నారు.
సీఎం స్థాయి నేతలమని చెప్పుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కుందూరు జానారెడ్డిల కుటుంబాల నుంచి కూడా ఎంపీ టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు కుటుంబాలు నల్లగొండ సీటుపై కన్నేయడం విశేషం. కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఇప్పటికే తాజాగా తెరపైకి వచ్చింది. వెంకటరెడ్డి,రాజగోపాలరెడ్డి ఇద్దరూ కూడా గతంలో ఎంపీలు కావడం తెలిసిందే. రాజగోపాల్రెడ్డి భార్య కూడా భువనగిరి టిక్కెట్కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇక జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్రెడ్డి సైతం నల్లగొండ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పెద్దపల్లి టిక్కెట్ కోసం జి.వివేక్ కుమారుడు జి. వంశీ అప్లై చేసుకున్నారు. ఇలా ఎందరెండరో హేమాహేమీల వారసులుగా రాజకీయాల్లోకి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇంతకీ కాంగ్రెస్ అధిష్ఠానం వీరిలో ఎవరికి అవకాశం కల్పించనుందో ?
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE