అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత టీబీజేపీలో జరుగుతున్న సోషల్ మీడియా వార్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పక్క పార్టీలను టార్గెట్ చేయాల్సిన నేతలంతా సొంత పార్టీ నేతలపైనే ట్రోలింగ్ చేసుకుంటున్న పరిస్థితి నెలకొనడంతో.. అధిష్టానం కూడా షాక్ అవుతోంది. పరస్పర విమర్శలతో పోస్టులు పెట్టుకోవడమే కాకుండా.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుకుంటున్నారు. నిజానికి తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఉండేది తామేనంటూ చెబుతూనే బీజేపీ ఎదుగుతూ వచ్చింది. పరిస్థితులు కూడా అలాగే కనిపించడంతో..బీఆర్ఎస్ కాకుండా బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదనే అంతా భావించారు. కానీ చాపకింద నీరులా కాంగ్రెస్ పుంజుకోవడం, ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో కేవలం 8 స్థానాల్లో మాత్రమే కాషాయ పార్టీ విజయం సాధించింది. దీంతో ఇంత భారీ ఓటమిని మూటకట్టుకున్నందుకు రాష్ట్ర సారథి కిషన్ రెడ్డిని బాధ్యుడిని చేయడమే కాకుండా.. డీగ్రేడ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పొత్తుల లెక్కలతో 8 స్థానాలు జనసేనకు ఇచ్చినా ఒక స్ధానాన్ని కూడా సంపాదించుకోలేకపోయింది. మిగిలిన అన్ని స్థానాలలో బీజేపీ పోటీ చేసినా కూడా కేవలం ఎనిమిది సీట్లకే పరిమితం కావడాన్ని ఎత్తి చూపిస్తూ.. పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వేదికగా చేసుకున్న కొంతమంది మారు పేర్లతో కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయనే ఓటమికి కారణంగా చెబుతూ డీగ్రేడ్ చేసేలా కొత్త ప్రచారానికి తెరతీశారు. చివరకు ఓటమి విషయంలో జనసేనాని పవన్పైన కిషన్ రెడ్డి కామెంట్లు చేశారంటూ చెప్పడంతో ఆయన తాజాగా ఖండించి అసలు తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. ఇలాంటి ట్రోలింగ్ను ఆపడానికి ఏం చేయాలా అని కిషన్ రెడ్డి వర్గీయులు రగిలిపోతున్నారు.ఇటు నెగెటివ్ ప్రచారంపై పార్టీ నేతలతో పాటు.. శ్రేణులు అప్రమత్తం కావాలని తాజాగా జరిగిన అధికార ప్రతినిధుల భేటీలో కిషన్ రెడ్డి సూచించారు.
కేవలం తనను టార్గెట్ చేస్తూ ఇలాంటి ట్రోలింగ్ జరగడం, అది కూడా సొంత పార్టీ నుంచే తనపై జరుగుతున్న ఇలాంటి విష ప్రచారాలపై కిషన్ రెడ్డి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే నెగిటివ్ ప్రచారాన్ని అడ్డుకోవడంతో పాటు.. ఇలాంటి వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పోక్స్ పర్సన్స్ సమావేశంలో కిషన్ రెడ్డి సూచనలు చేశారు. సొంత పార్టీ నుంచే కాకుండా ఇతరులు పార్టీని డ్యామేజ్ చేస్తూ పెట్టే పోస్టులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కౌంటర్ అటాక్ ఇచ్చేలా బీజేపీ శ్రేణులు కూడా పోస్టులు పెట్టాలని కిషన్ రెడ్డి ఆదేశించారు. అంతేకాదు సొంత పార్టీ నేతలపైన, ఇతర సోషల్ మీడియాలో తమ ట్రోలింగ్ ఎక్కువ అవడం వల్ల ఈ విషయాన్ని ఢిల్లీలోని కాషాయ పెద్దల వరకు తీసుకువెళ్లిన కిషన్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.
మరోవైపు బీజేపీలో బండి సంజయ్ వర్సస్, కిషన్ రెడ్డి అనేలా ఉంటున్న రాజకీయాలు టీబీజేపీని దెబ్బతీస్తున్నాయని రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. నిజమే టీబీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరినట్లే వాతావరణం కనిపిస్తోంది. బీజేపీలో ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు సొంతంగా సోషల్ మీడియా టీమ్లను ఏర్పాటు చేసుకుని వాటిని యాక్టివ్గా ఉంచుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యర్ధి పార్టీలపై విసరాల్సిన విమర్శలను సొంత పార్టీ నేతలపై చేయడాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం కూడా సీరియస్గానే తీసుకుందని తెలుస్తోంది. సోషల్ మీడియాను వాడుకోవాల్సిన విదంగా వాడుకోకుండా..ఇలా ఒకరిపై ఒకరు నెగెటివ్ ట్రోలింగ్ చేసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారట.
మరోవైపు సొంత పార్టీలోనే ..తమ నేతల ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్న ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కాషాయపెద్దలు దీన్ని కట్టడి చేయడంపై దృష్టి సారించారు. ఇప్పటికే సొంతింటిపైనే సోషల్ మీడియా వార్ ప్రకటిస్తున్న నేతలను నివేదిక ద్వారా హై కమాండ్ గుర్తించినట్లు తెలుస్తోంది .దీనికంతటికీ కారణం తమ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరే అని .. గ్రూపులుగా చీలిపోయి మరీ వీరంతా సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోల్స్కు కారణమవుతున్నారని అంచనాకు వచ్చిందట. ఐకమత్య లోపం వల్లే బీజేపీకి తెలంగాణలో ఇలాంటి గతి పట్టిందని అర్ధం చేసుకున్న అధిష్టానం.. వచ్చే లోక్ సభ ఎన్నికలలోపు దీనిని చక్కదిద్దాలని..పార్టీకి మరింత డ్యామేజ్ జరగకుండా దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE