12వ తరగతి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అందుకున్న తన మనవడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందించారు. మంగళవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు తనయుడు హిమాన్షు రావు గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి 12వ తరగతి పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు సీఎం కేసీఆర్తో పాటు ఆయన సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ, హిమాన్షు సోదరి అలేఖ్య, ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కేటాయించిన స్థానాల్లో కూర్చుని కార్యక్రమాన్ని తిలకించిన ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు హిమాన్షు పట్టా అందుకుంటున్న సమయంలో చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. పట్టా అందుకున్న అనంతరం హిమాన్షు వేదిక దిగి తన తాత, సీఎం కేసీఆర్ దగ్గరకు వచ్చి కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్నాడు.
ఈ సందర్భంగా హిమాన్షు రావు ఉన్నత చదువులు చదవాలని, జీవితంలో కొత్త శిఖరాలను సాధించాలని, సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. కాగా హిమాన్షు రావు ‘కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ (సీఏఎస్)’ విభాగంలో ప్రతిభ చూపినందుకు ఎక్స్లెన్స్ అవార్డును సైతం అందుకుకోవడం విశేషం. చదువుకున్న పాఠశాల శిక్షణలో భాగంగా అప్పగించిన సామాజిక సేవ అంశాన్ని సవాలుగా తీసుకుని, ఆ విభాగానికి అధ్యక్షత వహిస్తూ సామాజిక సేవలో గొప్పగా ప్రతిభ కనబరిచి అందులో ఎక్స్ లెన్సీ అవార్డును పొందడం గమనార్హం. ఇక సామాజిక సేవ విభాగంలోనూ ప్రతిభ కనబరిచినందుకు సీఎం కేసీఆర్ తన మనవడిని అభినందించారు. కాగా ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగం, సామాజిక సేవ తదితర అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం మెరిట్ అవార్డులను అందజేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE