అస్సాం, మిజోరం రాష్ట్రాల బోర్డర్ (సరిహద్దు)లో సోమవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అస్సాంలోని కాచర్ జిల్లా మరియు మిజోరంలోని కోలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న బోర్డర్ వద్ద భద్రతాసిబ్బంది, సరిహద్దుకు ఇరువైపులా ఉన్న పౌరులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ చోటుచేసుకున్న కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి చెందారు. అలాగే ఈ ఘటనలో అధికారులతో సహా మొత్తం 80 మంది గాయపడ్డట్టు తెలుస్తుంది. రాజ్యాంగ సరిహద్దు రక్షణ కోసం నియమించిన తమ అధికారులు మరియు పోలీసుల బృందంపై తమ భూభాగంలోనే దాడి చేయబడిందని అస్సాం ప్రభుత్వం పేర్కొనగా, తమ ప్రత్యర్థులు చేసిన దాడిని ఎదుర్కోవటానికి మిజోరాం పోలీసులు కాల్పులు జరపవలసి వచ్చిందని మిజోరాం ప్రభుత్వం పేర్కొంది. కాగా ఈ ఘటనపై మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అక్కడ చోటుచేసుకున్న ఘటన వీడియోలను పోస్ట్ చేస్తూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేశారు.
ఈ ఘటనపై అమిత్ షా వెంటనే జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి, సరిహద్దు సమస్యను ఎటువంటి హింస లేకుండా స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించినట్టు తెలుస్తుంది. అలాగే సరిహద్దు ప్రాంతానికి సీఆర్పీఎఫ్ బలగాలను కూడా పంపించారు. మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేస్తూ “అస్సాం-మిజోరాం సరిహద్దు వద్ద రాష్ట్ర రాజ్యాంగ సరిహద్దును సమర్థిస్తూ అస్సాం పోలీస్ కు చెందిన ఆరుగురు ధైర్యవంతులైన జవాన్లు తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలియజేయడం చాలా బాధ కలిగిస్తుంది. వారి కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ