గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ రోజు ట్యాంక్ బండ్ సమీపంలోని జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో జరిగే మేయర్ ఎన్నిక కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా ఉదయం 11.00 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు.
ఈ నేపథ్యంలో పార్టీ కార్పొరేటర్లు మరియు ఎక్స్ అఫీషియో సభ్యులతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి 32 ఎక్స్అఫీషియో సభ్యులు, 56 కార్పొరేటర్లతో కలిపి మొత్తం 88 మంది సభ్యులు బలముంది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా సీల్డు కవర్ లోని మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యరుల పేర్లు వెల్లడించి, ఈ ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై వారికీ పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. కాగా జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మిని ఎంపిక చేసినట్టుగా సమాచారం. అలాగే డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. సమావేశం అనంతరం తెలంగాణ భవన్ నుంచి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకోనున్నారు.
మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు బషీర్బాగ్ సమీపంలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనల నిర్వహించి జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరారు. మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధ ధీరజ్రెడ్డిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా రాంనగర్ కార్పొరేటర్ రవిచారి పేర్లను బీజేపీ ప్రకటించింది. ఇక జీహెచ్ఎంసీలో 149 కార్పొరేటర్లు, 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుతో కలిపి మొత్తం 193 మంది ఈ ఎన్నికకు హాజరు కావాల్సి ఉంది. ఉదయం 11.30కు మేయర్, ఉపమేయర్ ఎన్నిక చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ