తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి గాను దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించి వచ్చే మంత్రిమండలి సమావేశంలో ప్రవేశ పెట్టనున్నట్లు రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. గురువారం బీఆర్కేఆర్ భవన్ లో ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి కుమారి ఈషా సింగ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యలకు ఒక్కొక్కరికి 600 గజాల ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రదానం చేశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభను గుర్తించి భారీ స్థాయిలో ప్రోత్సహిస్తున్నారన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో గెలిచిన క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయలలో నజరానా ప్రకటించి వారిని సముచితంగా గౌరవిస్తూ ఇంటి స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, ప్రోత్సహిస్తున్నదని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహిచేందుకు ప్రభుత్వం త్వరలో ఒక సరికొత్త స్పోర్ట్స్ పాలసీని ఆవిష్కరించనున్నదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ యువత క్రీడలలో మంచి నైపుణ్యం ప్రదర్శించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో బంగారు పతకాలు సాధిస్తున్నారని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కిన్నెర మొగులయ్యకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సమయంలో సీఎం కేసీఆర్ ఘనంగా సత్కరించారు. కోటి రూపాయల నజరానాతో పాటు ఇంటి స్థలం పట్టా పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను నిర్మించి, ప్రతీ క్రీడా ప్రాంగణానికి స్పోర్ట్స్ కిట్ లను అందచేస్తామని చెప్పారు. ఉన్నత స్థాయి ప్రతిభ కలిగిన క్రీడాకారులను తయారు చేసే కోచ్ లకు సరైన గుర్తింపు కల్పిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE