హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 198 బస్తీ దవాఖానాలు ఉండగా, ఈ నెలలో మరో 26 ప్రారంభించబోతున్నామని, మొత్తంగా మూడు వందల బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం నాడు వైద్య ఆరోగ్య శాఖపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. “తెలంగాణ డయాగ్నొస్టిక్ పేరిట ఇప్పటికే అనేక పరీక్షలు చేస్తున్నాము. వీటితో పాటుగా ఎక్స్రే, ఇసిజి, అల్ట్రా సౌండ్ పరీక్షలు చేయబోతున్నాం. హైదరాబాద్ ను 8 జోన్లుగా విభజించి ఇప్పుడు ఉన్న బస్తీ దవాఖానా లకు వీటిని అనుసంధానము చేస్తాము. పేద ప్రజలకు వైద్య పరీక్షల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా పని చేయచేస్తున్నాం” అని మంత్రి అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టుల భర్తీ:
“అతి తక్కువ కాలంలో గవర్నమెంట్ పరంగా మెడికల్ షాప్ లు, అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన మందులను అందించేందుకు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టుల భర్తీ చేయడానికి అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులు కూడా క్లియర్ అయ్యాయి. కాబట్టి వాటన్నిటినీ రిక్రూట్ చేయబోతున్నాము. అదేగాక వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసుకోవటానికి ప్రతి ఆరు నెలలు లేదా సంవత్సరాల కొకసారి భర్తీ చేసుకోవడానికి మంత్రి వర్గ ఉప సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకమీదట డాక్టర్ల కొరత ఉండబోదు. కరోనా వ్యాక్సిన్ వస్తే ముందుగా పేదలకే అందిస్తాము” అని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కవ్యక్తి హెల్త్ ప్రొఫైల్ ను తయారుచేస్తాం:
“ఆరోగ్యశ్రీ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం 1200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. దీనితోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ వందల కోట్లు ఇస్తున్నాము. వీటి అవసరాలు లేకుండా ఆయుష్మాన్ భారత్ కంటే 100 రెట్లు మెరుగైన సేవలు అందించేలాగా ఆరోగ్యశ్రీ లో మరికొన్ని వైద్య చికిత్సలను చేర్చబోతున్నాము. పేషెంట్ కు సంబంధించిన చరిత్రను నిక్షిప్తం చేయడానికి ఎలక్ట్రానిక్ రికార్డులు తయారు చేయు విధానము సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే చింతమడకలో పూర్తయింది. కంటివెలుగు కూడా విజయవంతంగా పూర్తి చేసాము. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ ను చేయబోతున్నాము. అనేక కొత్త పద్ధతులకు తెలంగాణలోనే పునాది పడింది. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రజలు కూడా ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఆసుపత్రుల మీద నమ్మకం ఉంచి చికిత్స చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము” అని మంత్రి అన్నారు.
కొత్తగా 238 అంబులెన్స్ వాహనాలు అందుబాటులోకి:
“108 అంబులెన్స్ సౌకర్యాలను కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిర్వహిస్తుంది. గతంలో మండలానికి ఒక అంబులెన్సు ఉండగా. కొత్త మండలాలు ఏర్పడిన నేపథ్యంలో వాటికి కూడా ఒక్కో అంబులెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాము. హైదరాబాద్, వరంగల్ వంటి ఆస్పత్రులలో అవసరానికి అనుగుణంగా ప్రతి ఆసుపత్రిలో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. గిఫ్ట్ ఏ స్మైల్ కింద 118, ప్రభుత్వం 100 అంబులెన్సులు కొనుగోలు చేస్తున్నాం, మరో 20 అంబులెన్స్ లు సిఎస్ఆర్ కింద ప్రభుత్వానికి అందాయి. మొత్తంగా 238 వాహనాలతో కొత్తగా 108 సేవలు అందించబడుతున్నాయి. ప్రమాదాలు జరగడం ద్వారా మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా మంచానికే పరిమితమైన వారికి చికిత్స అందించేందుకు పాలియేటివ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే 8 కేంద్రాలు నడుస్తున్నాయి. మరో రెండు కేంద్రాలను హైదరాబాదులో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాము. వీటి ద్వారా పేద ప్రజలకు వైద్య ఖర్చుల భారం తగ్గించవచ్చును. లాభాలను ఆశించకుండా నడిపిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం మద్దతు అందించి వాటి ద్వారా మరింత సేవ చేయాలని కమిటీ నిర్ణయించింది” అని తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu