రాష్ట్రాల్లో నెలకున్న కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్ష ద్వీప్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారు పాల్గొన్నారు. కాగా తెలంగాణ నుంచి అధికారులతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఖమ్మం కలెక్టరేట్ నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన జ్వర సర్వేను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాన్ని మంచి వ్యూహంగా అభినందించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అనుసరించేందుకు విధాన రూపకల్పన చేస్తామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి వెల్లడించారు.
ముందుగా తెలంగాణలో కరోనా పరిస్ధితులు, ప్రభుత్వం సన్నద్ధత, జ్వర సర్వే, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై కేంద్ర మంత్రిత్వ శాఖకు మంత్రి హరీశ్ రావు వివరణ ఇచ్చారు. “రెండో వేవ్ సమయంలో కరోనా కట్టడి కోసం దేశంలోనే తొలిసారి తెలంగాణ జ్వర సర్వే మొదలు పెట్టి మంచి ఫలితాలు సాధించింది. సీఎం ఆదేశాలతో మరోసారి జ్వర సర్వే ప్రారంభించాం. మొత్తం కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు, రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు సమకూర్చుకున్నాం. రాష్ట్రంలో ఇప్పటికి 77,33,427 ఇండ్లల్లో జ్వర సర్వే చేయగా, 3,45,951 కిట్లను అందించాం. రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ పక్రియ విజయవంతంగా కొనసాగుతుంది” అని మంత్రి పేర్కొన్నారు.
అలాగే 60 ఏళ్లు దాటిన అందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 60 ఏళ్లుపైబడి కోమార్బిడిటీస్ తో బాధపడుతున్నవారికే ప్రికాషన్/బూస్టర్ డోసు ఇస్తుండగా, త్వరగా 60 ఏళ్ల వయస్సు పైబడిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇక కోవిషీల్డ్ రెండు డోసుల గడువును తగ్గించాలని, రెండో డోసు, ప్రికాషనరీ డోసు మధ్య వ్యవధి 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించాలని కోరారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి కూడా బూస్టర్ ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. ఈసిఅర్పీ-2 కింద రాష్ట్రానికి రావాల్సిన రెండో దశ పెండింగ్ నిధులు విడుదల చేయాలని మంత్రి కోరారు. మరోవైపు శుక్రవారం ఉదయం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా రూ.7.5 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ విభాగాన్ని, ట్రామా కేర్, మిల్క్ బ్యాంక్ కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు, మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి ప్రారంభించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ