భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పురపాలక శాఖ విభాగాల అధిపతులు మరియు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ బాబా ఫసియుద్దిన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ పరిధిలోని అధికారులు క్షేత్ర స్థాయి సహాయక కార్యక్రమాలలో నిమగ్నమవ్వాలని ఆదేశించారు.
“నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని స్థానిక ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్ కు తరలించాలి. వారికి అక్కడే ఆహారంతో పాటు అవసరమైన దుప్పట్లు, వైద్య సదుపాయం కల్పించాలి. బస్తీ దవాఖానాలలో పనిచేస్తున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది సేవలు వినియోగించుకోవాలి. భారీ వర్షాలకు నగరంలో పెద్దఎత్తున చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు కూలిన నేపథ్యంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ సంస్థలతో కలిసి జీహెచ్ఎంసీ సమన్వయం చేసుకోవాలి. హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వరద నీరు త్వరగా పారేలా తెరిచిన మ్యాన్ హోల్స్ విషయంలో తగిన జలమండలి అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓపెన్ నాలాల వద్ద ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలా స్థానిక మున్సిపల్ కమిషనర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయపరచాలి” అని మంత్రి కేటిఆర్ ఆదేశాలు ఇచ్చారు.
ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన అన్ని సహాయక చర్యలను చేపడుతాం:
“వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ జీహెచ్ఎంసీ మరియు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది తగిన సూచనలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలి. భారీ వర్షాల వలన ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికే అధికారులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన అన్ని సహాయక చర్యలను చేపడుతాం. రోడ్ల పైన ఇల్లు లేక ఉండేవారు (హోం లెస్) వారిని వెంటనే జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్ లకి తరలించాలి. భవనాలు నిర్మిస్తున్న ప్రాంతాలను తనిఖీ చేసి, సెల్లార్ తవ్వకాల వలన ప్రమాదాలు జరగకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలి. కాలం చెల్లిన శిథిలావస్థకు చేరిన భవనాల నుంచి ప్రజలను వెంటనే బయటకు తీసుకు రావాలి. ఇందుకోసం అవసరమైతే పోలీస్ సహకారం తీసుకోవాలి. మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం” అని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu