రాష్ట్రంలోని మత్స్యకారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన సిద్ధిపేట జిల్లాలోని చందలాపూర్ లో గల రంగనాయక సాగర్ లో, సిద్ధిపేట పట్టణంలోని కోమటి చెరువులో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావులు చేప పిల్లలను విడుదల చేసి కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించనున్నారు. అదేరోజు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోని నీటి వనరులలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీల సభ్యులు చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు.
గత సంవత్సరం రాష్ట్రంలోని 18,335 నీటి వనరులలో 51.80 కోట్ల రూపాయల వ్యయంతో 68.52 కోట్ల చేప పిల్లలను, 93 నీటి వనరులలో 8.61 కోట్ల రూపాయల వ్యయంతో 4 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయగా, ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 30 వేల వివిధ నీటి వనరులలో 80 కోట్ల రూపాయల ఖర్చుతో 93 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 25 కోట్ల రూపాయల వ్యయంతో 10 కోట్ల రొయ్య పిల్లలను 200 వివిధ నీటి వనరులలో విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తలసాని తెలిపారు. కరోనా నేపథ్యంలో చేప పిల్లల విడుదల చేసే సమయంలో మాస్క్ లు ధరించి, దూరం పాటించడం వంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శానిటైజర్ లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ