ఇటీవల కాలంలో హైదరాబాద్లో రోడ్డుప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ముఖ్యకారణం చాలామంది మద్యం తాగి వాహనాలు నడపడం. మరొక కారణం మైనర్ల డ్రైవింగ్. కొద్దిరోజుల నుంచి విద్యార్థులు, మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే మైనర్లపై కఠినచర్యలకు సిద్ధమవుతున్నారు. వారు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులను జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు.
కొంతమంది తల్లిదండ్రులతో పోట్లాడి ద్విచక్రవాహనాలను కొనాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. స్నేహితులంతా బైకుల్లో వస్తున్నారని.. తాము మాత్రం స్కూల్ కి, కాలేజీకి బస్సులో వెళ్తున్నామని.. ఇది తమకు చిన్నతనంగా ఉందని పలువురు మైనర్లు వాపోతున్నారని పోలీసు సర్వేలో తేలింది. కొందరు మైనర్లు బైకుల కోసం తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారని, క్రెడిట్ కార్డుల ద్వారా కొనాలంటూ బలవంత పెడుతున్నారని ట్రాఫిక్ పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది.
అలాగే, లైసెన్స్ లేకుండానే బైక్ రేసుల్లో పాల్గొంటున్నారని పోలీసులు గుర్తించారు. అలాంటివారు తొలిసారి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే.. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులనూ జైలుకు పంపుతామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో మైనర్ పిల్లల తల్లిదండ్రులు కఠినంగా లేకపోతే అనవసరంగా జైలుకెళ్లాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలలో ఇలా బైకులు, కార్లు నడుపుతున్న యువకులు, మైనర్లపై హైదరాబాద్ పోలీసులు ఇప్పటి వరకు 4385 కేసులు నమోదు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF