తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో అధికార పార్టీ, ఎంఐఎం పార్టీ నేతల మధ్య ఆసక్తికర సంవాదం చోటుచేసుకుంది. సమావేశాల్లో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. తన 25 ఏళ్ళలో ఇలాంటి సభ చూడలేదని, ప్రభుత్వం ఇష్టానుసారంగా బీఏసీలో నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఇక చర్చ సందర్భంగా సభా నాయకుడు కనిపించడం లేదని, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సభలో కనిపించడం లేదని అన్నారు. అధికార పార్టీ నేతలకు టీవీ డిబేట్ లకు వెళ్లడానికి టైం ఉంటుంది కానీ.. అసెంబ్లీకి వచ్చేందుకు మాత్రం టైం లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులకు అంశాలపై మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వడం లేదని, రాష్ట్రంలోని సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు.
ఇక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. పార్టీకి ఉన్న సభ్యులను బట్టి సమయం ఇస్తామని, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎం పార్టీకి గంట ఇస్తే.. అధికార పార్టీకి ఎన్ని గంటల సమయం ఇవ్వాలని ప్రశ్నించారు. బీఏసీ సమావేశానికి అక్బరుద్దీన్ ఒవైసీ రారని, పైగా ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. సభలో ఆవేశంగా ప్రసంగం చేసినంత మాత్రాన సరిపోదని, అర్థవంతంగా సమాధానం చెప్పడం తమకు తెలుసనీ బదులిచ్చారు. ఇక అసెంబ్లీకి సభా నాయకుడు రాలేదని ఒవైసీ ప్రశ్నిస్తున్నారని, అసలు సభా నాయకుడితో ఒవైసీకి ఏం సంబంధమని మంత్రి తిరిగి ప్రశ్నించారు. కాగా దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. తాను సభకు కొత్త కాదని, చాలా సార్లు ఎమ్మెల్యే అయ్యానని అన్నారు. సభలో టైంను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసని, రాజ్యంగబద్దంగా చర్చ జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఇక గతంలో కూడా చాలాసార్లు సభలో సంబంధిత అంశాలపై గంటల తరబడి చర్చించామని, అయితే అప్పడు ఎప్పుడు తమకు అభ్యంతరం చెప్పలేదని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE