నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూమా కుటుంబంపై అవినీతి అరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ నిరూపించాలని సవాల్ చేయడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పార్టీకి రాజీనామా చేసి రావాలని, ప్రజల్లోనే తేల్చుకుందామని వ్యాఖ్యానిస్తూ భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేకు సవాల్ చేశారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు నంద్యాలలోని గాంధీ చౌక్ దగ్గర చర్చకు రావాలని.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి అఖిల ప్రియ సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం పోలీసులు అఖిల ప్రియను హౌస్ అరెస్ట్ చేశారు. ఆళ్ళగడ్డలోని అఖిల ప్రియ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా 30 మందికి పైగా సిబ్బందిని నియమించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.
అయితే ఎలాంటి అనుమతి లేకుండా బహిరంగ చర్చకు ఏర్పాట్లు చేశారని పేర్కొంటూ అఖిల ప్రియ పీఏకు గత రాత్రి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. యాక్ట్ 30 అమల్లో ఉన్నందున దీనికి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఈరోజు వాటికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని అఖిల ప్రియ తెలిపారు. నంద్యాలలోని గాంధీ చౌక్ వద్దకు వస్తానని.. తాను కానీ, తన కుటుంబం కానీ అక్రమాలకు పాల్పడ్డట్లు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి ఆధారాలతో సహా నిరూపించాలని, తప్పు ఒప్పుకుని తనకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా రవిచంద్రారెడ్డి చూపు టీడీపీ వైపు ఉందని, ఇప్పటికే ఆయన టీడీపీ నేతలతో టచ్లో ఉన్నారని, వచ్చే ఎన్నికలకు ముందు ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అఖిల ప్రియ ఆరోపించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE