తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 1, గురువారం నుండి రాష్ట్రవ్యాప్తంగా 940 వ్యాక్సినేషన్ కేంద్రాలలో 18 ఏళ్లుపైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జీ.శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రాంతంలో 100 ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడినవారికి మొదటి డోసు వ్యాక్సిన్ వేయబడుతుందని, అయితే కో-విన్ పోర్టల్ ఉపయోగించి ముందస్తు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
అలాగే రాష్ట్రంలో ఇతర పట్టణ స్థానిక సంస్థలలో కూడా 204 ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, కో-విన్ పోర్టల్ లో ఆన్లైన్ బుకింగ్తో చేసుకుని 18 ఏళ్లు పైబడినవారు మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. ఇక 634 గ్రామీణ పీహెఛ్సీ లలో వాక్-ఇన్ పద్ధతిలో ముందస్తు ఆన్లైన్ బుకింగ్ లేకపోయినా మొదటి డోసు వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని చెప్పారు. ఈ వ్యాక్సినేషన్ విధానం జూలై 3 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. మరోవైపు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి రెండవడోసును, మొదటి డోసు తీసుకున్న రోజు నుంచి 14-16 వారాల మధ్య ఇవ్వబడుతుందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ