తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఇంజినీరింగ్-2020 పరీక్షను సెప్టెంబరు 9,10,11,14 తేదీల్లో నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9, బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువుగా ఉండడంతో రోజూ రెండు షిఫ్టుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు మొత్తం 1,43,165 అభ్యర్థులు హాజరు కానుండగా, తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్ లో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల దగ్గర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలను ముందుగానే శానిటైజ్ చేశారు. పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థులకు థర్మల్ స్కానింగ్ చేయడంతో పాటుగా, చేతులను శుభ్రంగా శానిటైజ్ చేసుకున్నాకే లోపలి అనుమతిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను కచ్చితంగా ఆచరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వారికీ ఎలాంటి కరోనా లక్షణాలు లేవని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని అధికారులు ముందుగానే సూచించారు. మరోవైపు ఎంసెట్-అగ్రికల్చర్ పరీక్ష సెప్టెంబర్ 28, 29 తేదీలలో జరగనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu