ఆంధ్రప్రదేశ్ మంత్రులు, నేతలపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఏపీకి చెందిన నేతలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘నేను చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని కొందరు నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు. నేను ఏపీ ప్రజలను ప్రజలను తిట్టలేదు. అయితే నేను ఏపీని కించ పరచే విధంగా మాట్లాడానని కొందరు నాయకులు అంటున్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఏపీ ప్రజల తరపునే నేను మాట్లాడాను. కేవలం అక్కడి నాయకులను మాత్రమే ప్రశ్నిస్తున్నాను. ఉన్న మాట అంటే అంత ఉలుకెందుకు? ఏపీ మంత్రులు ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదు? ఏపీలోని నాయకులకు చేతనైతే ప్రత్యేక హోదా కోసం, విశాఖ ఉక్కు కోసం పోరాడండి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి కాళేశ్వరం లాగా ప్రజలకు నీళ్లు ఇవ్వండి. మరోసారి చెబుతున్నా.. తెలంగాణ అభివృద్దిలో భాగమైన ప్రతి ఒక్కరు తమ బిడ్డలే’ అని వ్యాఖ్యానించారు.
కాగా ఇటీవలే మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్దానికి కారణమయ్యాయి. ఆయన కామెంట్స్పై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే ఏపీ మంత్రుల కామెంట్స్కు హరీష్ రావు కూడా తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తూ వస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై అభ్యంతరం వెలిబుచ్చారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో అది మరువకముందే మంత్రి హరీష్ రావు మరోసారి ఏపీ నేతలను ఉద్దేశించి తాజాగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఏపీ మంత్రులు ఏమంటారో అని అంతటా ఆసక్తి నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE