కర్ణాటకలో ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఇటవలే మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడే రాజీనామా చేయగా.. తాజాగా సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కూడా బీజేపీని వీడారు. మే 10న రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం జగదీశ్ షెట్టర్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరిన కొద్ది నిమిషాలకే కేపీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్, హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు ‘బి’ ఫారాన్ని అందజేయడం విశేషం. కాగా గతంలో షెట్టర్ 1994 నుండి ఆరు సార్లు ఈ నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ తరపున గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార బీజేపీ ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో అలకబూనిన షెట్టర్, నిన్న పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్లో చేరారు.
ఈ సందర్భంగా 67 ఏళ్ల లింగాయత్ సామజిక వర్గ నాయకుడైన షెట్టర్ మాట్లాడుతూ.. ‘నేను బీజేపీని విడిచిపెట్టి కాంగ్రెస్లో చేరాను. నేను కాంగ్రెస్లో చేరడంపై కర్ణాటకలో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నేను బీజేపీ నుంచి వైదొలగడంపై చర్చలు జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా నా బాధ ఎవరికీ అర్థం కాలేదు. కేంద్ర మాజీ మంత్రి అనంత్ కుమార్, మాజీ సీఎం బీఎస్ యడియూరప్పతో కలిసి పార్టీని నిర్మించాను. ఉత్తర కర్ణాటకలో పార్టీని నిర్మించాను. బీజేపీ నాకు అనేక పదవులు ఇచ్చింది. నేను నా బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాను. నేను సంఘ్ పరివార్కు చెందిన వాడిని, ఏబీవీపీ నాయకుడిని. బీజేపీ నేతలు కొన్ని రోజుల క్రితమే టికెట్ గురించి నాకు తెలియజేసి ఉండవచ్చు. కానీ చివరి నిమిషంలో టికెట్ నిరాకరించి బీజేపీ నన్ను అవమానించింది. శ్రేయోభిలాషుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఇప్పుడు కాంగ్రెస్లో చేరాను. నా రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది’ అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE