రైతు బీమా తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదని, రైతు మరణిస్తే బీమా ఇస్తోంది కేవలం కేసీఆర్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక మరియు పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు. సోమవారం ఆయన సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజన్నపేట గ్రామంలో రూ.35 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అలాగే దేవునిగుట్ట తండాలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఎల్లారెడ్డిపేట మండలంలోని బాకూరుపల్లి తండా గ్రామపంచాయతీ భవనం, తర్వాత రాచర్ల తిమ్మాపూర్లో వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాజన్నపేటలో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం కింద బడిలో రూ.33 లక్షల ఖర్చుతో అదనపు తరగతి గదులు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. రాజన్నపేటలో వెనుకబాటుతనం ఉండటంతో దత్తత తీసుకుని అభివృద్ధి చేశానని గుర్తుచేశారు. ఇళ్ళు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి గృహలక్ష్మి పథకం కింద ఇళ్లను మంజూరు చేస్తామని, కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు వారం రోజుల్లో కుట్టు మిషన్లు అందజేస్తామని తెలిపారు. అలాగే అర్హులై ఉండీ ప్రభుత్వ పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే వారికీ అందజేస్తామని, గ్రామాల్లో రోడ్ల పక్కన అండర్ డైనేజీలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక రైతు భీమా వంటి పథకం తెలంగాణ మినహా ప్రపంచంలో ఎక్కడా లేదని, రైతు చనిపోతే భీమా ఇస్తోంది దేశంలో కేవలం కేసీఆర్ ప్రభుత్వమేనని, ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక లక్ష రైతు కుటుంబాలకు రూ.5 వేల కోట్లు ఆర్థిక సహాయం అందజేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE