వరంగల్ లోక్సభ ఎంపీ స్థానంపై న్నేసిన సీపీఐ.. కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకుని వరంగల్ ఎంపీ బరిలో తమ అభ్యర్థిని నిలపాలని చూస్తోంది. ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించిన పార్టీ, రాష్ట్ర, జాతీయ నాయకత్వం ఈ విషయంపై చకచకా పావులు కదుపుతోందని తెలుస్తోంది. పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ బీఆర్ లెనిన్ పేరును పార్టీ దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు కుదరకపోయినా కూడా సీపీఐ అభ్యర్థిగా బరిలో నిలపడానికి బలంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో ట్రేడ్ యూనియన్లను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించిన కామ్రేడ్ భగవాన్ దాస్ కుమారుడే బీఆర్ లెనిన్. భగవాన్దాస్ గతంలో సీపీఐ పార్టీ బలోపేతానికి, పేదలు, కార్మిక వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటాన్ని దృష్టిలో ఉంచుకుని.. పార్టీ అధిష్టానం ఆయన కుమారుడు లెనిన్ పేరును తెరపైకి తీసుకువచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని వర్గాలలోనూ లెనిన్కు సత్సంబంధాలు ఉండటం తమకు కలిసొచ్చే అంశంగా సీపీపీ భావిస్తోంది. అంతేకాకుండా లెనిన్ తండ్రి భగవాన్ దాస్ చేసిన సేవలు.. ఇంకా చాలామంది మరచిపోలేదన్న విషయాన్నికూడా పరిగణనలోకి తీసుకుని ఇవన్నీ ఎన్నికల్లో కలిసి వస్తాయని పార్టీ అనుకుంటోంది.
సీపీఐ పార్టీ జాతీయ హోదాను పునరుద్ధరించుకోవడానికి.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కనీస సంఖ్యలో అభ్యర్థులను నిలపడం ఆ పార్టీకి తప్పనిసరి అయింది. దీంతోనే దేశ వ్యాప్తంగా కనీస సంఖ్యలో అభ్యర్థులను పోటీలో నిలపడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని 16 లోక్సభ స్థానాల్లో కనీసం రెండు సీట్ల నుంచి పోటీ చేయడానికి సీపీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ కైవసం చేసుకోవడంతో..ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఖమ్మం, వరంగల్, నల్లగొండలో ఏదైనా ఒక స్థానం నుంచి తమ అభ్యర్థిని బరిలో ఉంచడానికి ప్రయత్నిస్తోంది.
ఖమ్మం, నల్లగొండ స్థానాలు జనరల్వి కావడంతో ఇక్కడ నేతల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. దీంతో ఎస్సీ రిజర్వుడుగా వరంగల్ లోక్సభ స్థానంపై సీపీఐ కన్నేసింది. ఇప్పటికే ఇండియా కూటమిలో సీపీఐ అగ్రనేత డి.రాజా వరంగల్ స్థానంపై తమకు అవకాశం కల్పించాలని కోరారట. అంతేకాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారట. అయితే తాజా రాజకీయయ పరిణమాలతో కాంగ్రెస్ అధిష్టానం కూడా పార్టీకి అనుకూలమైన నిర్ణయం ఇస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు వరంగల్ స్థానంపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి కొంతమంది సీనియర్లతో పాటు మరికొంతమంది తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. టీపీసీసీ నాయకురాలు సింగపురం ఇందిర, వరంగల్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, దొమ్మటి సాంబయ్య వరంగల్ స్థానం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాదు సీనియర్ నేత, రేవంత్కు అత్యంత సన్నిహితుడైన అద్దంకి దయాకర్ను వరంగల్ లోక్సభ అభ్యర్థిగా నిలబెడతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ కేటాయించకపోవడం, ఇటీవల ఎమ్మెల్సీ పదవి వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో చేజారిపోవడంతో ఆయనకు ఎంపీ సీటు కచ్చితంగా ఇస్తారన్న చర్చ నడుస్తోంది.ఇంత పోటీ ఉండగా కాంగ్రెస్తో కలిసి అదే స్థానంపై కన్నేసిన సీపీఐ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE