తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో గెలవడానికి ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. నిన్న రాత్రి మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడటం, దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆయన దీనిపై స్పందించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీలు కూడబలుక్కుని కొనుగోలు డ్రామాలు ఆడుతున్నాయని, బరిలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో లబ్ది కోసమే ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతోందని రేవంత్ అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తొక్కేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఇదే పంథా అనుసరించిందని, ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదేవిధంగా అధికార పార్టీతో కలిసి గేమ్ ఆడుతోందని విమర్శించారు. మరికొన్ని రోజుల్లో కేంద్రం నుంచి ప్రత్యేక బలగాలు మునుగోడులో మోహరించనున్నాయని, టీఆర్ఎస్ అభ్యర్ధికి సానుభూతి పెంచే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతుందని రేవంత్ తెలిపారు. కేసీఆర్ తెలంగాణాలో బీజేపీ ఎదుగుదలకు సహకరిస్తున్నారని, ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY