ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ, టోల్ వసూలు టెండర్ వెనుక భారీ కుంభకోణం ఉందని, ఇది దేశంలోనే అతి పెద్దదని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. శనివారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన దీనిపై మాట్లాడుతూ.. రూ. 30వేల కోట్లు ఆదాయం వచ్చే రింగ్ రోడ్డును కేవలం రూ. 7,380 కోట్లకే ముంబయి కంపెనీకి తాకట్టు పెట్టారని, దీనివెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారని విమర్శించారు. ఇందులో సుమారు రూ. 1,000 కోట్లు చేతులు మారి ఉంటాయని అభిప్రాయపడిన ఆయన, పెట్టుబడులు అంటే నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని.. ఉన్నవాటిని తాకట్టు పెట్టడం కాదని అన్నారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిందని, అలాగే హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్ను నిర్మించిందని గుర్తుచేశారు.
తెలంగాణలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారంటే.. దానికి కారణం విమానాశ్రయం మరియు ఔటర్ రింగ్ రోడ్డే అని రేవంత్ రెడ్డి తెలిపారు. అలాంటిది వేల కోట్ల ఆదాయం వచ్చే రింగ్ రోడ్ను స్వలాభం కోసం ప్రయివేటుకు అమ్మేశారని, దీని వెనుక మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహారం నడపగా.. అరవింద్ కుమార్ సంతకం పెట్టారని ఆరోపించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం దిగిపోయేముందు తీసుకున్న నిర్ణయాలపై ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం సమీక్ష చేస్తుందని, దీనిప్రకారం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొట్టమొదట వీటిపై విచారణ జరిపిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించిన ఆయన, ప్రజల ఆస్తులను సీఎం కేసీఆర్ చవకగా అమ్మేస్తుంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అయితే తాము మాత్రం దీనిని వదిలేది లేదని, టెండర్ విధానాలపై విచారణ సంస్థలన్నింటికి పిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE