వరి వేయడంపై ఆంక్షలు పెట్టడం లేదని, లాభ సాటి పంటలే ప్రభుత్వ ఆకాంక్ష అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వానాకాలం సీజన్ లో పంటల విషయంలో ఎవరి ఇష్టం వారిదని, ఈ విషయంలో ఆంక్షలు లేవని అన్నారు. తెలంగాణ రైతన్న అన్నదాత మాత్రమే కాకుండా, వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చే స్పూర్తి ప్రదాత కావాలన్నదే సీఎం కేసిఆర్ ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు. “రైతన్న పంటతో మార్కెట్ వరకు పోవడం కాదు. తెలంగాణ రైతు పంట కల్లం కాడికే మార్కెట్ రావాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన. వ్యవసాయం పట్ల ప్రభుత్వ చిత్త శుద్ది కొందరు స్వార్థ పరులకు అర్థం కాకున్నా, రైతన్నలు అర్థం చేసుకున్నారు కాబట్టే ప్రత్యామ్నాయ పంటల దిశగా సాగుతున్నారు” అని మంత్రి ప్రకటనలో పేర్కొన్నారు.
వానాకాలం ఎవరి ఇష్టం వారిది, ఈ విషయంలో ఆంక్షలు లేవు:
“యాసంగిలో ఇక్కడ పండే వరి ధాన్యం నుండే ఎక్కువ నూకలు వస్తాయని మొదటి నుండి చెబుతున్నాం. ఇది కూడా కేంద్రం సృష్టించిన సమస్య. తెలంగాణ ప్రాంత పరిస్థితుల నేపథ్యంలోె కేంద్ర ప్రభుత్వ ధాన్యం సేకరణ నిబంధనల నుండి సడలింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది లేదా కేంద్ర ప్రభుత్వం నేరుగా బియ్యంతో సంబంధం లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని చెబుతున్నాం. యాసంగిలో తెలంగాణ నుండి వచ్చే వడ్లు కొనం అని కేంద్రం స్పష్టంగా చెబుతుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. వానాకాలం ఎవరి ఇష్టం వారిది, ఈ విషయంలో ఆంక్షలు లేవు. అయితే వరికి మించి లాభదాయకంగా ఉన్న పత్తి, కంది, పెసలు, మినుముల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఈ ఏడాది కేంద్రం క్వింటాలు పత్తికి రూ.5726 నుండి గరిష్టంగా రూ.6025 ధర ప్రకటించింది. కానీ పత్తికి క్వింటాలు రూ.8 వేల నుండి రూ.12 వేలకుపైగా బహిరంగ మార్కెట్లో ధర లభించింది. పెసలు మద్దతుధర క్వింటాలుకు రూ.7275 ఉండగా అంతకుమించి రూ.7600 వరకు, కందులు క్వింటాలుకు రూ.6300 మద్దతుధర కాగా రూ.6700 వరకు, మినుములు రూ.6300 మద్దతుధర కాగా రూ.6500 వరకు బహిరంగ మార్కెట్లో ధర పలికింది. వేరుశెనగ క్వింటాలుకు రూ.5550 మద్దతుధర కాగా రూ.8 వేల పై చిలుకు ధర లభించింది” అని చెప్పారు.
రైతులు డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది:
“వరి సాగుకు మించి తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడి, తక్కువ పంటకాలంలో రైతులకు ఎక్కువ లాభం కళ్ల ముందు కనిపిస్తున్నది కాబట్టి రైతులను ఈ దిశగా ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత. గత ఏడాది రైతులు పెద్ద ఎత్తున పత్తి వేయక నష్టపోయారు. అందుకే ఈసారి వారిని పత్తి వేయాలని కోరుతున్నాం. కంది సాగుతో భూసారం పెరగడమే కాకుండా తక్కువ పెట్టుబడి, నీటి ఎద్దడిని తట్టుకుని 4 నుండి 6 క్వింటాళ్లు దిగుబడి వస్తున్నది. అభ్యుదయ రైతులు 12 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడి సాధిస్తూ అధిక లాభాలు అర్జిస్తున్నారు, క్రమంగా రైతులు కూడా అలవాటు పడుతున్నారు. వరి మినహా ఇతర పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం లేదు అన్నట్లు, రైతులు వాటిని సాగు చేసి నష్టపోతున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. కనీస మద్దతుధరకు మించి నువ్వులు, శెనగలు, పత్తి, వేరుశెనగ, కందులు, మినుములు బహిరంగ మార్కెట్లో అమ్ముడు పోతున్నాయి. కారణం వీటికి జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నది. అందుకే రైతులు డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని ఆది నుండి తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది” అని చెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ వ్యవసాయరంగంలో అమలవుతున్న పథకాలు లేవు:
“వీటన్నింటిని పక్కకుపెట్టి తెలంగాణ రైతాంగ విజయాలను చిన్నగ చేయాలన్న కురచబుద్ది గలవారు, ఆది నుండి తెలంగాణను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారు తెలంగాణ వ్యవసాయ విజయాలను చూడడానికి నిరాకరిస్తున్నారు. దీనిని తెలంగాణ సమాజం గమనిస్తున్నది. వ్యవసాయరంగం బలోపేతం మూలంగానే గ్రామసీమలు బలపడతాయని భావించిన సీఎం కేసీఆర్ సాగునీరు, రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటుతో వ్యవసాయరంగాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ వ్యవసాయరంగంలో అమలవుతున్న విధంగా పథకాలు లేవు. కానీ కొందరు కురచబుద్దితో తెలంగాణ విజయాలను మరుగున పడేయాలని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటికైనా వారు బుద్ది మార్చుకోవాలి” మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ