కొందరికి సెంటిమెంట్ పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా సెంటిమెంట్ ఎక్కువే. ప్రతి విషయంలోనూ సెంటిమెంట్.. సెంటిమెంట్ అంటుంటారు. ఇక కేసీఆర్ ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 15న హుస్నాబాద్లో జరగనున్న సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అయితే ప్రతివిషయంలోనూ సెంటిమెంట్ ఫాలో అయ్యే కేసీఆర్.. ప్రచారం విషయంలోనూ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.
ఎన్నికల ప్రచారం అనగానే ముందు నుంచి కేసీఆర్ చూపు హుస్నాబాద్ వైపు వెళ్తుంది. హుస్నాబాద్ రాష్ట్రంలో ఈశాన్య దిక్కున ఉంటుంది. అందుకే హుస్నాబాద్ కలిసొచ్చే ప్రాంతామని.. అక్కడి నుంచి ప్రచారం ప్రారంభిస్తే కచ్చితంగా గెలిచి తీరుతామని ఆయన నమ్మకం. అందుకే 2014, 2019 ఎన్నికల్లో కూడా కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రచారం మొదలు పెట్టారు. ఆ రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అందుకే ముచ్చటగా మూడో సారి కూడా హుస్నాబాద్ నుంచే ప్రచారం మొదలు పెట్టాలని గులాబీ బాస్ నిర్ణయించారు.
దీనిపై ఇటీవల మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్కు సెంటిమెంట్ అని అన్నారు. రాష్ట్రంలో హుస్నాబాద్ ఈశాన్యం దిక్కున ఉండడంతో కలిసొచ్చే ప్రాంతంగా కేసీఆర్ భావిస్తారని చెప్పుకొచ్చారు. ఈ సెంటిమెంట్ ప్రకారమే మూడో సారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ అక్కడ మొదటి సభ నిర్వహిస్తున్నారని వివరించారు. అలాగే హుస్నాబాద్ ప్రజలంటే కూడా కేసీఆర్కు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.
ఇకపోతే అక్టోబర్ 15న కేసీఆర్ తెలంగాణ భవన్లో అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అప్పుడే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. అలాగే తమ అభ్యర్థులకు బీ ఫాంలను అందజేయనున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం హుస్నాబాద్ సభా ప్రాంగణానికి కేసీఆర్ బయల్దేరి వెళ్లనున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం పోతారం గ్రామ సమీపంలో సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది.
అయితే రెండు సార్లు కేసీఆర్ సెంటిమెంట్ వర్కౌంట్ అయింది. హుస్నాబాద్లో తొలి సభ నిర్వహించినందుకు గానూ రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మరి ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?.. కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతారా?.. మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.