కేసీఆర్.. ఆయన ఏం చేసినా ఓ లెక్కుంటది.. దాని వెనుక ఓ కథ ఉంటది. అసలు ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే కేసీఆర్.. సమర శంఖం పూరించారు. అన్ని పార్టీల కంటే ముందే తమ గెలుపు గుర్రాలను ఆటలోకి దింపారు. 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఓ విడత ప్రచారాన్ని పూర్తి చేస్తే.. కొన్ని పార్టీలు మాత్రం అభ్యర్థులను ఎంపిక చేయడంలోనే తలామునకలవుతున్నాయి. ఇక కేసీఆర్ కూడా ఎన్నికల రణరంగంలోకి దిగుతారనుకున్న సమయంలో పెద్ద సమస్యొచ్చి పడింది. కేసీఆర్ అనారోగ్యం బారిన పడ్డారు. వైరల్ ఫీవర్, ఛాతి ఇన్ఫెక్షన్ సమస్యలతో సతమతమవుతున్నారు.
కేసీఆర్కు సుస్తి చేయడం.. వైద్యులు మరికొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో.. బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలయింది. కేసీఆర్ అసలు ప్రచారానికి వస్తారా?.. రాక పోతే ఎలా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అదే సమయంలో పార్టీ బరువు, బాధ్యతలను నెత్తిన పెట్టుకున్నారు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. కేసీఆర్ అనారోగ్యం బారిన పడినప్పటికీ.. ఇద్దరూ సుడిగాలి పర్యటనలు చేపట్టారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. ఇప్పటికే 50కి పైగా నియోజక వర్గాలను చుట్టి వచ్చారు.
ఇక మరికొన్ని రోజుల పాటు ఇంటిపట్టునే ఉంటారని అంతా భావిస్తున్న క్రమంలో గేర్ మర్చారు కేసీఆర్. ఎన్నికల క్షేత్రాన్ని వేడెక్కించేందుకు రెడీ అయిపోయారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 41 బహిరంగ సభలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 9 వరకు అన్ని నియోజకవర్గాలు చుట్టి వచ్చేందుకు ప్రణాళిక రెడీ చేశారు. మొత్తం 17 రోజుల్లో 41 బహిరంగ సభలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రత్యర్థి పార్టీలు రంగంలోకి దిగేలోపే.. మరో విడత ప్రచారం పూర్తి చేయాలని ప్లాన్ చేశారు.
దసరా నవరాత్రులు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజున తమ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫాంలు అందజేయనున్నారు. అలాగే అదే రోజున హుస్నాబాద్లో జరగనున్న బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక బీఆర్ఎస్ మొదటి సభ కావడంతో పాటు.. కేసీఆర్ కూడా హాజరు కాబోతుండడంతో నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ఆ తర్వాత అక్టోబర్ 16న భువనగిరి.. 17న సిరిసిల్ల, సిద్ధిపేట.. 18న జడ్చర్ల, మేడ్చల్లలో జరగనున్న బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. అయితే దసరా, బతుకమ్మ పండుగలు రావడంతో బహిరంగ సభలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. తిరిగి అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు వరుసగా బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 9న కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలలో రెండు చోట్లు నామినేషన్ వేయనున్నారు.
ఇకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలహీనంగా ఉంది. మరీ ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్లు బై బై చెప్పడంతో ఆ ప్రాంతంలో పార్టీ మరింత డల్ అయిపోయింది. ఈక్రమంలో గులాబీ బాస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ జిల్లాలో భారీ ఎత్తున ప్రచారాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE