ఎన్నికల సమయంలో రాజీనామాలు, చేరికలు సాధారణమే అయినా.. బీఆర్ ఎస్లో ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు. అసమ్మతి కూడా ఈసారి ఎక్కువే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. ఏడుగురికి మినహా సిట్టింగ్ లకే మళ్లీ టికెట్ లు కేటాయించి బరిలో దించారు. దింపడమే కాదు.. తన లెక్క ఎప్పుడూ తప్పదని చాటి చెబుతూ 88 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. టికెట్ల కేటాయింపులో ఇప్పుడు కూడా అదే సాహసం చేశారు. రానున్న ఎన్నికలకు మొత్తం 119 స్థానాలకు గాను 115 సీట్లను ఒకే లిస్ట్ లో ప్రకటించడమే కాదు.. మొత్తం 105 మంది సిట్టింగుల్లో (ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో కలుపుకుని) 98 మందికి మళ్లీ టికెట్లు ఇచ్చి.. మరోమారు తమ మార్క్ సత్తా చాటారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఆ తర్వాత బీఆర్ ఎస్ కు ఊహించని షాక్లు తగులుతున్నాయి.
కేసీఆర్ టికెట్ల ప్రకటన అనంతరం చాలా చోట్ల అసమ్మతి బయటపడింది. పెద్దపల్లి బీఆర్ ఎస్ అభ్యర్థిగా దాసరి మనోహర్ రెడ్డిని ప్రకటించిన కొద్ది గంటల్లోనే నియోజకవర్గంలో సీనియర్ నేత మనోహర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అదే పార్టీకి చెందిన బొద్దుల లక్ష్మణ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా కొందరు నేతలు అసమ్మతిని వెళ్లగక్కినా.. సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ (ఖానాపూర్) ఎపిసోడ్ లు తీవ్ర చర్చకు దారి తీశాయి. కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉన్న తుమ్మల “తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను” అని పేర్కొంటూ బీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పడం ఆ పార్టీకి పెద్ద నష్టమే అని చెప్పక తప్పదు.
తనకు టికెట్ కేటాయించినప్పటికీ.. కుమారుడికి ఇవ్వలేదనే అక్కసుతో మైనంపల్లి కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టికెట్ ఆశించి భంగపడి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్ కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కల్వకుర్తి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ టి.బాలాజీ సింగ్ పార్టీని వీడారు. రాజీనామాలు చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు (చెన్నూరు), ఆరేపల్లి మోహన్ (మానకొండూరు), వేముల వీరేశం(నకిరేకల్), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), తదితరులున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అయిన కొందరు తీరు నచ్చక చాలా చోట్ల కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు తదితర నేతలు కూడా రాజీనామాలు చేశారు. ఎన్నికల సమయంలో రాజీనామాలు, చేరికలు సాధారణమే అయినా.. బీఆర్ ఎస్లో ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు.
తొలుత అసమ్మతిని అంతగా పట్టించుకోని సీఎం కేసీఆర్ ఆపై.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య వంటి నేతలకు పదవులు ఇవ్వడం ద్వారా కాస్త సద్దుమణిగేలా చేశారు. అయినప్పటికీ నిన్న కూడా ఇద్దరు సీనియర్ నాయకులు కారు దిగేశారు. వారిలో ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ దంపతులు, కంటోన్మెంట్ కు చెందిన సీనియర్ నేత శ్రీ గణేశ్ ఉన్నారు. దీంతో బీఆర్ ఎస్ లో మళ్లీ కుదుపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గులాబీ అసమ్మతి నివారణపై మరింతగా ఫోకస్ పెట్టారు. ఎంత వరకూ సఫలీకృతం అవుతారో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE