“భద్రతలేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయనకి ప్రాణహాని తలపెడుతున్నారు. ఎన్నడూ ఏ తప్పూ చేయని 73 ఏళ్ల చంద్రబాబు పట్ల రాక్షసంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియల్ రిమాండ్లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్రబాబు గారిని అనారోగ్య కారణాలతో అంతమొందించే ప్రణాళిక ఏదో రచిస్తున్నారు. చంద్రబాబు గారి ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉంది. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబు గారిని ముద్దాయి అని హెల్త్ బులెటిన్లో పదే పదే పేర్కొనేందుకు పెట్టిన శ్రద్ధ ఆయన ఆరోగ్యం, భద్రతపై పెట్టడంలేదు. చంద్రబాబు గారికి ఏ హాని జరిగినా, సైకోజగన్ సర్కారు, జైలు అధికారులదే బాధ్యత.”- నారా లోకేశ్
“జైలులో ఉన్న చంద్రబాబుకు కుటుంబసభ్యులు పంపుతున్న భోజనంపై అనుమానాలు ఉన్నాయి. ఆ ఆహారం ముందు లోకేష్ తిన్నాకే చంద్రబాబుకు పెట్టాలి. చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు 66కిలోలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన బరువు 67 కిలోలు. మరో కిలో బరువు పెరిగే బాధ్యత మేం తీసుకుంటాం. చంద్రబాబు ప్రాణాలకు ఎలాంటి ముప్పూ లేదు. ” – ఏపీ మంత్రి అమర్నాథ్
రాజకీయాల్లో తలపండిన నారా చంద్రబాబునాయుడు.. 73 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లినప్పుడి నుంచీ రాజకీయాలు హాట్ హాట్గానే ఉంటున్నాయి. ఒక్క ఏపీలోనే కాదు.. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. ఆయనకు మద్దతుగా ఐ యామ్ విత్ సీబీఎన్.. అంటూ ర్యాలీలు, కంచాలు.. డప్పుల చప్పుళ్ల వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చేస్తూనే ఉన్నారు కూడా. ఇదిలాఉంటే.. జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ఓ పక్క ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరో పక్క అదే ఆరోగ్యం చుట్టూ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు హీటెక్కిస్తున్నాయి.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబు.. స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారు. చంద్రబాబు మొహంపై దద్దుర్లు, ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి వైద్యం అందించారు. ప్రతిరోజు మూడుసార్లు ఫిజికల్ వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య పరీక్షల్లో బీపీ, షుగరు, హార్ట్బీట్ ఫిజికల్ పరీక్షలు నార్మల్గా ఉన్నట్లు జైలు అధికారులు చెబుతున్నారు. అయితే.. బాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి రిస్క్ లో ఉందని లోకేశ్ ట్వీట్ చేస్తే.. జైల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, సరైన వైద్య సదుపాయాలు లేవని చంద్రబాబు కోడలు బ్రాహ్మణీ కూడా ట్వీట్ చేశారు. అత్యవసర వైద్యం అందించడంలో ఏపీ ప్రభుత్వం విఫలైమంది అంటూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో తన భర్తకు సరైన వైద్య చికిత్స అందించడంలేదని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. చంద్రబాబుకు అత్యవసరంగా వైద్యాన్ని అందించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
అయితే.. చంద్రబాబు కుటుంబ సభ్యులను వైసీపీ మంత్రులు, నేతలు తిప్పికొడుతున్నారు. చంద్రబాబు ఇంటి భోజనంపైనే అనుమానాలు ఉన్నాయని ఏపీ మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేస్తే.. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలాడుతోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జైలు ఏమైనా అత్తగారిల్లా .. ఏసీ పెట్టమని అడుగుతున్నారన్నారు. ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్నే చంద్రబాబు తింటున్నారని .. చంద్రబాబు బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం చుట్టూనే రాజకీయం నడుస్తుంటే.. ఆయన అభిమానులు మాత్రం బాబు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా.. కాదేదీ.. రాజకీయాలకు అనర్హం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.