మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు, విద్యార్థులు చేపడుతున్న నిరసనలు, ఆందోళనలు 20వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 6, సోమవారం నాడు తుళ్లూరు నుంచి భారీ సంఖ్యలో రైతులు, యువకులు, మహిళలతో మందడం వరకు పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రలో తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి, మల్కాపురం, మందడం గ్రామస్థులు పాల్గొంటున్నారు. కాగా రాజధాని గ్రామాల్లో జరిగే పాదయాత్రకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీనిపై రాజధాని రైతులు స్పందిస్తూ తమ పాదయాత్రను ఎవ్వరూ అడ్డుకోలేరని, పాదయాత్రను కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు.
మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ రైతులు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రాజధాని కోసం 33 ఎకరాల భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల గురించి ప్రజాప్రతినిధులు అవహేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలు రాష్ట్రప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే ఉన్నాయని, త్వరలో హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక కూడా వాటికీ జిరాక్స్ లాగే ఉంటుందని రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు.
[subscribe]