వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచేశారు. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అంచనాలకు ఏమాత్రం అందకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు జాబితాలను ప్రకటించారు. పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్ షాక్ ఇచ్చారు. ఇదే సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఈసారి జగన్ ఝలక్ ఇచ్చారు. ప్రస్తుతం మైలవరం నియోజకవర్గానికి వసంత కృష్ణప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఆయనకు జగన్ టికెట్ నిరాకరించారు.
అవును.. వసంత కృష్ణ ప్రసాద్ను ఈసారి జగన్ సైడ్ చేశారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్న సర్నాల తిరుపతి రావుకు ఈసారి మైలవరం టికెట్ను జగన్ కేటాయించారు. అయితే కొద్దిరోజులుగా వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ హైకమాండ్తో అంటీ అంటనట్లు ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా ఆయన సక్రమంగా నిర్వహించలేదని ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా ప్రభుత్వంపైనే ఆయన గతంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు అందిస్తున్నా, అభివృద్ధిలేదని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈవ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఈ కారణాల చేతనే ఈసారి జగన్ ఆయనను సైడ్ చేశారని తెలుస్తోంది.ఇక ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ దారెటు? అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయన ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసినప్పుడే వైసీపీని వీడుతారని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు అవే గుసగుసలు మళ్లీ వినిపిస్తున్నాయి. టికెట్ దక్కకపోవడంతో వసంత కచ్చితంగా టికెట్ మారుతారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తెలుగు దేశం పార్టీలో చేరుతారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగు దేశం పార్టీతో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరికపై చర్చలు జరపగా.. అటు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఇక కృష్ణప్రసాద్కు టీడీపీ మైలవరం లేదా జగ్గయ్యపేట టికెట్ ఇచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అవి రెండు కాకపోతే విజయవాడ ఎంపీ టికెట్ అయినా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE