ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ వై నాట్ 175 అంటూ మరోసారి అధికారం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి లక్ష్యంగా ఏకం అవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు లాంఛనమే. బీజేపీ వైఖరిపై స్పష్టత రావాల్సి ఉంది. జగన్ సింగిల్ గానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సీఎం జగన్ తిరిగి అధికారం దక్కుతుందనే ధీమా వెనుక అనేక కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.
ఏపీలో 2024 ఎన్నికలపైన ఆసక్తి పెరిగింది. ఎన్నికల ప్రచారం అన్నట్లుగానే పార్టీలు పోటీ పడుతున్నాయి. పొత్తు రాజకీయంతో ప్రతిపక్షాలు సీఎం జగన్ను టార్గెట్ చేస్తున్నాయి. నారా లోకేశ్ యువగళం, పవన్ వారాహి యాత్ర, చంద్రబాబు జిల్లాల పర్యటనలతో ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైన పురందేశ్వరి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కేంద్రంలో అవసరమైన సమయంలో వైసీపీ మద్దతుగా నిలుస్తోంది. కేంద్రంలోని ముఖ్యులతో సీఎం జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అటు ఎన్డీఏలో పవన్ కొనసాగుతున్నారు. టీడీపీ త్వరలో ఎన్డీఏలో చేరుతుందనే ప్రచారం సాగుతోంది. దీంతో, ఏపీలో బీజేపీ రాజకీయం అంతు చిక్కకుండా ఉంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే జగన్ 2024 ఎన్నికల కోసం పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అటు కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే అధికారిక పొత్తుకు మాత్రం దూరంగా ఉన్నారు. బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతున్న వేళ టీడీపీతో వైఖరి ఏంటనేది తేలటానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మూడు పార్టీలు కలవటం ఖాయమైతే మరోసారి ప్రత్యేక హోదాతోపాటు పలు అంశాలు మరోసారి రాజకీయంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో చేస్తున్న సీట్ల ప్రకటనలతో టీడీపీ అలర్ట్ అవుతోంది. బీజేపీ కూడా కలిస్తే సీట్ల పంచాయితీ తప్పదనేది వైసీపీ అంచనా. పార్టీల నేతలు చివరి నిమిషంలో కలిసినా.. కింది స్థాయిలో కేడర్ ఎన్నికల వేళ అంత సులభంగా కలవరనేది వైసీపీ సీనియర్ల విశ్లేషణ. బీజేపీ చివరి నిమిషంలో టీడీపీతో పొత్తుకు నో చెబితే పవన్ నిర్ణయం మరింత కీలకంగా మారుతుంది.
ఇదే సమయంలో మరోసారి జగన్ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతోనే ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయనేది వైసీపీ బలంగా ప్రచారంలోకి తీసుకొస్తున్న అంశం. జగన్ను ఒంటరిగా ఓడించలేకనే పవన్-చంద్రబాబు కలుస్తున్నారనే ప్రచారం ప్రారంభించారు. ఇక, పవన్ తన యాత్రల్లో భాగంగా సీఎం జగన్ను ఏకవచనంతో మాట్లాడటం.. హెచ్చరికలు చేయటం చర్చనీయాంశంగా మారింది. అదే తరహాలో చంద్రబాబు, లోకేశ్ తమకు తిరిగి అధికారం దక్కితే ఏం చేస్తామనే చెప్పే అంశాల కంటే జగన్ను అవసరానికి మంచి టార్గెట్ చేస్తున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి.
పురందేశ్వరి సైతం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో చేస్తున్న వ్యాఖ్యలపైన చర్చ సాగుతోంది. అటు జగన్ మాత్రం తాను చేసిన సంక్షేమం తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇప్పటి వరకు 2.43 లక్షల కోట్ల సంక్షేమ లబ్ధి బ్యాంకు ఖాతాల ద్వారా అందించినట్లు చెబుతున్నారు. ప్రతీ ఇంటికి మంచి జరిగితేనే తనకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. తాజాగా జగనన్న సురక్ష ద్వారా మరింతగా గుర్తించిన అర్హులకు ఆగిన ఫించన్ల పునరుద్దరణ.. పథకాల్లో అవకాశం కల్పించేలా నిర్ణయించారు. దీని ద్వారా ఓట్ బ్యాంక్ మరింత పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా జగన్ను విమర్శించటం.. ప్రస్తుత సంక్షేమానికి ధీటుగా తాము ఏం చేస్తామో చెప్పలేకపోవటం ప్రతిపక్షాల వైఫల్యంగా కనిపిస్తోంది. ఇవన్నీ జగన్కు తిరిగి అధికారంలోకి రావటానికి మేలు చేస్తాయనేది వైసీపీ నేతల అంచనా.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE