చైనాలో కరోనా వైరస్ వ్యాపి చెందడంతో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రైనింగ్ కోసం చైనా దేశానికి వెళ్లిన 35 మంది విశాఖపట్నంకు చెందిన యువతి, యువకులను తిరిగి రాష్ట్రానికి రప్పించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. చైనాలో కరోనా వైరస్ బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని చైనాలో ఉన్న 35 మందిని త్వరితగతిన రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. చైనాలోని భారత రాయబార కార్యాలయానికి ఆదేశాలివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్యానెల్ ఆప్టో డిస్ల్పే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికయిన వీరు శిక్షణ కోసం గత ఆగస్టులో వుహాన్ వెళ్లినట్టుగా తెలిపారు. మార్చి నెల మొదటివారంలో వెనక్కి వచ్చి తిరుపతి వద్ద నెలకొల్పిన సంస్థలో పనిచేయాల్సి ఉందని అన్నారు. అయితే ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా వీలైనంత త్వరగా వారిని రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేయాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
[subscribe]