ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. గన్నవరం ఘటన నేపథ్యంలో ఈ లేఖ రాసిన ఆయన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక, విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఇక సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను, అధికారులను సీఎం జగన్ వాడుకుంటున్నారని ఆరోపించారు. లేఖలో చంద్రబాబు ఇలా పేర్కొన్నారు.. ‘ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే.. ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు, కేసులు, హింసాత్మక ఘటనలు, పోలీసు టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇందుకు గన్నవరం విధ్వంసం ఒక తాజా ఉదాహరణ. గన్నవరం ఘటనలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై, పార్టీనేతల ఇళ్లపై, కార్యకర్తలపై దాడులు చేసి వారిఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు వారినే పోలీస్ టార్చర్ కు గురిచేసి.. ఆ బాధితులనే నిందితులుగా మార్చి, జైలుకు పంపిన వైనంపై వాస్తవాలు మీ దృష్టికి తేవడానికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను’ అని తెలిపారు.
ఇంకా లేఖలో చంద్రబాబు ఇలా తెలియజేశారు.. ‘అరాచక పాలనతో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. జీవితాంతం కష్టపడి పేదలు సంపాదించుకున్నఆస్తులను కబ్జా చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల నిర్బంధాలు, అక్రమ కేసులు.. బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకు వేధింపులు, మహిళలపై ఆకృత్యాలకు రాష్ట్రం వేదికగా మారింది. పన్నుల పై ప్రజలు ప్రశ్నిస్తే కేసులు, జాబ్ క్యాలెండర్ గురించి గళమెత్తితే నిరుద్యోగ యువతకు వేధింపులు, ధాన్యం బకాయిలు అడిగితే రైతులకు బేడీలు, జీతాలు అడిగితే ఉద్యోగులకు బెదిరింపులు అన్నట్లు పరిస్థితి మారింది. ప్రజల తరుపున గళం వినిపిస్తున్న బడుగు బలహీన వర్గాలను అణిచివేయాలనే కుట్రలో భాగంగానే గన్నవరం హింసకు పాల్పడ్డారు. స్థానిక శాసన సభ్యుడి అరాచకాలను, సంకల్ప సిద్ది స్కాంలో అక్రమాలను గన్నవరం టీడీపీ బీసీ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా గట్టిగా ప్రశ్నించారు.
‘దీంతో కక్ష కట్టి తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. కార్లు, ఇతర వాహనాలు తగలబెట్టారు. కార్యకర్తలు, నేతలపై దాడులుచేశారు. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు ఆత్మరక్షణ, ఆస్తులు రక్షణకు అక్కడికి వచ్చిన పాపానికి టీడీపీ వారిపైనే తిరిగి కేసులు పెట్టారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది. ఈ దాడుల ఘటనలు అన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో, అక్కడ ఉన్న వారి ఫోన్ లలో రికార్డు అయ్యాయి. వాస్తవాలు ఇలా ఉంటే యావత్ సమాజం విస్తుపోయేలా బాధితులైన టీడీపీ కార్యకర్తల పైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. పోలీసులు దాడిలో బాధితులైన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు’ అని చంద్రబాబు వెల్లడించారు.
‘ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి నేను చేపట్టిన పర్యటనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఇటీవల జగ్గంపేట, పెద్దాపురంలో మా పర్యటనల అనంతరం.. ప్రజా స్పందన చూసి భయపడిన ఈ ప్రభుత్వం, అనపర్తి సభకు అడ్డంకులు సృష్టించింది. సభకు ముందగా అనుమతులు ఇచ్చిన పోలీసులు ప్రభుత్వ ఒతిడితో అడ్డంకులు సృష్టించారు అయితే నాడు సహాయ నిరాకరణ ఉద్యమంలో మహాత్మా గాంధీజీ చేసిన దండి మార్చ్ స్పూర్తితో నేను 7 కిలోమీటర్లు నడిచి అనపర్తి మార్చ్ నిర్వహించాను. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ సాగిన అనపర్తి సభ విజయవంతం అయ్యింది. దీంతో సీఎం జగన్ ఒత్తిడితో ఎన్నడూ లేని విధంగా ఏకంగా వెయ్యిమందిపై అనపర్తిలో టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ గాని, కార్యకర్తలు గాని, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలు గాని వీటికి భయపడే పరిస్థితి ఉండదు. ఇందుకోసం ఏ స్ధాయి పోరాటానికి అయినా నేను సిద్దంగా ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో ధర్మానికి-అధర్మానికి, ప్రజాస్వామ్యానికి-నియంత పోకడలకు మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రశ్నించే ప్రజలు, ప్రజా సంఘాలు, వారి పక్షాన పోరాడే ప్రతిపక్షాలు అణిచివేతకు గురైతే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజానీకమే. ఈ పోరాటంలో అందరం కలిసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకుందాం. సమిష్టి తిరుగుబాటుతో ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఎదుర్కొందాం. మన భవిష్యత్ ని మన బిడ్డల భవిష్యత్ ని కాపాడుకుందాం’ అని చంద్రబాబు నాయుడు లేఖలో పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE