ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో ప్రస్తుతం జిల్లాపరిషత్ లు, మండలపరిషత్ లు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాపరిషత్ లలో ప్రత్యేక అధికారుల పాలనను జులై 4, 2021 వరకు, మండల పరిషత్ లలో జులై 3, 2021 వరకు పొడిగిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు ఇచ్చారు.
ఏపీలో 2019 జులై 3 న ఎంపీపీలు, ఎంపీటీసీలు, జులై 4 న జెడ్పి ఛైర్మన్స్, జెడ్పిటిసిల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచే ప్రత్యేక అధికారుల పాలనను ఏర్పాటు చేసి, ప్రతి ఆరునెలలకు ఓసారి పొడిగిస్తూ వస్తున్నారు. అయితే 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, కరోనా వ్యాప్తి పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఎన్నికల నిర్వహణపై పలు సందర్భాల్లో ఎస్ఈసీ, రాష్ట్రప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారుల పాలనను మరోసారి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ