ఆంధ్రప్రదేశ్ లోని అవ్వా, తాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వృద్ధాప్య పెన్షన్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వృద్ధులకు నూతన సంవత్సర కానుకగా ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పెన్షన్ రూ.2,500కు పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం నెలకు రూ.2,250 ఇస్తుండగా.. వచ్చే నెల నుంచి రూ.250 అదనంగా చెల్లించనుంది. సీఎం జగన్ ఎన్నికల హామీలో భాగంగా వృద్ధులకు పెన్షన్లను రూ.3వేల వరకు పెంచుకుంటూ వెళ్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఇస్తున్న పెన్షన్లకు రూ.250 జత చేసి.. నెలకు రూ.2,250 ఇస్తున్నారు. ఇప్పుడు ఆ మొత్తానికి మరో రూ.250 కలిపి రూ.2,500 అందజేస్తారు. మంగళవారం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
వృద్ధాప్య పెన్షన్ల పెంపుతో పాటు వివిధ పథకాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను సీఎం జగన్ తీసుకున్నారు. రైతు భరోసా పథకాన్ని కూడా జనవరిలోనే ప్రారంభించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. దీనికి సంబంధించిన తేదీని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. అలాగే, జగనన్న శాశ్వత గృహహక్కు పథకాన్ని కూడా జనవరి నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఓటీఎస్ కింద ఛార్జీలు చెల్లించిన లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేయనున్నారు. జనవరి నెలలోనే అమ్మఒడి స్థానంలో ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 45-60 ఏళ్ల మధ్య వయసున్న అగ్రవర్ణ పేద మహిళలకు రూ.15వేల చొప్పున జమ చేయనున్నారు. వారికి మూడేళ్లలో రూ.45వేలు ఇవ్వనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ