ఏపీలో త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్న టీడీపీ దానికి అనుగుణంగా నే నిర్ణయాలు తీసుకుంటుంది. టికెట్ల కేటాయింపు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి మొహమాటాలకు చోటు లేకుండా నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసినా.. మొహమాటం మీద, తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది నేతలకు టికెట్లు కేటాయించడం వల్లే పార్టీ ఘోరంగా ఓటమి పాలయిందని బాబు గుర్తించారు. మరికొద్ది నెలల్లో జరగబోతున్న ఏపీ శాసనసభ ఎన్నికల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైసీపీని మళ్లీ అధికారంలోకి రానీకుండా చేయడమే తమ లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేన పార్టీతో పొత్తు తమ పార్టీకి కచ్చితంగా కలిసొస్తుందని నమ్ముతుందన్న నమ్మకంతో ఉన్న చంద్రబాబు.. ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా టికెట్ల కేటాయింపు విషయంలో ఈసారి సీరియస్ గానే నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో తెలుగు దేశం పార్టీ సీనియర్ నేతలకు షాక్ తప్పేలా కనిపించడం లేదు . ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే తాను టికెట్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే తేల్చి చెప్పేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎర్రం నాయుడు వారసులకు మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు కూడా సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉండడంతో ఆచితూచి టికెట్లను కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు ఒకవేళ బీజేపీ కూడా తమతో కలిసి వస్తే ఎక్కువ శాతం ఎంపీ స్థానాలను ఎక్కువ ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే ముందు నుంచీ కూడా గత ఎన్నికలలో లాగా ఒకే కుటుంబంలో రెండు ,మూడు టికెట్లు ఇచ్చేది లేదని నిర్ణయానికి వచ్చారు. అందుకే తమ దగ్గరకు వచ్చిన నేతలకు ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్రమేనని బాబు కుండ బద్దలు కొట్టేస్తున్నారు.
మరోవైపు ఇప్పుడు ఎన్నికలు టీడీపీలోని ప్రతి నేత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. గత ఎన్నికలలో లాగా ఇప్పుడు ఉదాసీనంగా వ్యవహరించే పరిస్థితి లేదని.. దీనిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని చంద్రబాబు సీనియర్లకు ముందుగా నచ్చ చెబుతున్నారు. అయితే రాయలసీమ జిల్లాలకు సంబంధించి రాజకీయ కుటుంబాలు టీడీపీలో ఎక్కువ ఉండడం, ఓకే కుటుంబం నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు కూడా ఎక్కువగానే ఉండడం చంద్రబాబు ముందున్న సవాల్గా మారుతోంది. అయితే పార్టీకి ఎంత వీర విధేయులయినా , ఓకే కుటుంబం.. ఓకే టికెట్ నియమాన్ని మాత్రం ఈ సారి ఎన్నికలలో కచ్చితంగా పాటించాలని బాబు నిర్ణయించుకున్నారు. దీంతో పార్టీలోని సీనియర్ల ఆశలు గల్లంతయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ