కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలనపై ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ఏళ్ల తరబడి కొత్త రేషన్ కార్డులకు, కొత్త పింఛన్లకు ఇతరాత్ర పథకాలకు నోచుకోని వారంతా వెల్లువలా అభయహస్తం కోసం దరఖాస్తులు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇవ్వని అవకాశం తాజా ప్రభుత్వం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ముప్పై రోజులు కూడా కాకముందే.. ప్రజా సంక్షేమం కోసం బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ లబ్ది కోసం ఎదురుచూస్తున్న వారు లక్షల్లో ఉన్నారని ప్రజాపాలన స్పష్టం చేస్తోంది. ఈ కార్యక్రమం ప్రారంభించిన మొదటి రోజే.. 7, 46, 414 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో సుమారు 2 లక్షల దరఖాస్తులు కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కావడం.
తొలిరోజే ఈ స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారంటే.. కార్యక్రమం ముగిసే వరకూ అంచనాలకు మించి దరఖాస్తులు రావడం ఖాయం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాత కూడా మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అర్హులకు పథకాలు అందించేందుకు సర్కారు పక్కా ప్రణాళికలు రూపొందించింది. అధికారుల బృందాల వారీగా ప్రజల వద్దకే వెళ్లి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రోజూ రెండు గ్రామాల్లో ప్రజాపాలన నిర్వహించనున్నారు. ఇందుకు అనుగుణంగా మండలస్థాయిలోను, పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డుల సంఖ్యకు అనుగుణంగాను.. అధికారుల బృందాలను ఏర్పాటుచేస్తారు. ప్రతిబృందంలో.. తహశీల్దారు లేదా రెవెన్యూ శాఖ ప్రతినిధి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేదా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధి, మండల పంచాయతీ అధికారి లేదా పంచాయతీరాజ్ శాఖ ప్రతినిధి, మండల వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయశాఖ ప్రతినిధి, పౌరసరఫరాల శాఖ ప్రతినిధి, పీహెచ్సీ వైద్యాధికారి లేదా వైద్య- ఆరోగ్య శాఖ ప్రతినిధి, మండల విద్యాధికారి లేదా విద్యాశాఖ ప్రతినిధి, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇతర సంబంధిత అధికారులు.. పది మంది బృందంగా ప్రజాపాలన నిర్వహిస్తున్నారు.
లబ్ధిదారులు దరఖాస్తులను ముందుగానే నింపి.. గ్రామసభకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు నియోజకవర్గ స్థాయిలో నోడల్ ఆఫీసర్ను నియమించి, వారితో కార్యక్రమ పర్యవేక్షణ చేయించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా మంత్రులను కూడా ఇన్చార్జిలుగా నియమించింది. ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించటానికి ముందు రోజు.. ఆ గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డు పరిధిలో దండోరా వేయించి ప్రచారం చేసింది. అలాగే.. మహిళల కోసం ప్రకటించిన పథకాలే ఎక్కువ ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేపట్టింది. దరఖాస్తులు స్వీకరించడానికి మహిళలకు కనీసం రెండు కౌంటర్లు, పురుషులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వచ్చే దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించనున్నారు.
సర్కారుకు ఎటువంటి చెడ్డ పేరూ రాకుండా పకడ్బందీగా దరఖాస్తుల స్వీకరణ చేపడుతోంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా లేకపోయినా, అర్హులకు పథకాలను అందించకపోయినా ప్రజలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, లంకె బిందెలు ఉంటాయంటే.. ఖాళీ బిందెలే ఉన్నాయని పదే పదే బీద అరుపులు చేస్తున్న ప్రభుత్వం.. ఏదో కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందనే అనుమానాలు ఉన్నాయి. అదే జరిగితే, కాంగ్రెస్ ప్రజాపాలనపై ఎంతో సంతోషంగా ఉన్న ప్రజలు.. ఆ పాలన ఏమాత్రం గాడి తప్పినా ఆగ్రహానికి గురికాకతప్పదు. ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో తప్పకుండా కనిపిస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ