వైనాట్ నినాదంతో 2024 ఎన్నికలకు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాల్లో విజయం సాధించడమే కాకుండా.. ఆ తర్వాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి.. సరిగ్గా ఎన్నికలు కొద్ది రోజులు ఉన్నాయనగా కీలకనేతలు పార్టీని వీడుతుండటం టెన్సన్ పెడుతోంది. అందులోనూ సీటిచ్చిన వాళ్లు కూడా పక్క పార్టీల వైపే పరుగులు తీయడం కొత్త చర్చకు దారి తీస్తుంది.టికెట్ రాక అసంతృప్తులు జంప్ అయితే ఒక లెక్క కానీ.. టికెట్ ఇచ్చి పోటీ చేయమని చెబుతున్నా నోనో అంటున్న నేతల తీరు అర్ధం కాక సీఎం జగన్ తలపట్టుకుంటున్నారట.
ఇప్పటికే వైసీపీ నుంచి ఆరుగురు ఎంపీలు, పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు వీడగా వీరి వెనుక నడవడానికి మరికొంతమంది రెడీ అయినట్లు తెలుస్తోంది. వైసీపీకి తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజీనామా చేయడంతో ఆయన వెంట ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడి సైకిల్ ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి, మైలవరం అసెంబ్లీకి వసంత కృష్ణప్రసాద్కు టికెట్లు ఖరారు చేసినా కూడా..వారిద్దరూ టీడీపీ నుంచి పోటీ చేయడానికే మొగ్గు చూపిస్తున్నారు. నర్సారావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు పోటీ చేయడానికి అవకాశం ఇస్తామన్నా కూడా వైసీపీకి నో చెప్పి టీడీపీలో టికెట్ కన్ఫమ్ చేసుకున్నారు. జగన్ కేబినెట్లో రెండోసారి చాన్స్ దక్కించుకున్న గుమ్మనూరు జయరామ్ కూడా..తనకు వైసీపీ నుంచి కర్నూలు పార్లమెంటు టికెట్ ఖరారు చేసినా కూడా పోటీ చేయనంటూ.. టీడీపీ అభ్యర్థిగా గుంతకల్ అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు.
పెనుమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి వైసీపీని వీడి వెళ్లకుండా కొంతమంది కలగజేసుకున్నా.. ఆయన టీడీపీలోకి వెళ్లిపోయారు. అలాగే కందుకూరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్రెడ్డి పోటీకి ఇంట్రస్ట్ చూపించకపోవడంతో.. తమిళనాడుకు చెందిన కఠారి అరవిందా యాదవ్కు సీటిచ్చారు. కానీ ఆ తర్వాత కఠారి అరవిందా యాదవ్ కూడా పోటీ చేయడానికి ముందుకు రాకపోవడంతో .. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ పేరును తాజాగా విడుదల చేసిన 8వ జాబితాలో ప్రకటించారు.
ఇలా చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ప్రతిపక్షపార్టీల వైపు చూస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే సర్వేలన్నీ వైసీపీకి వ్యతిరేకంగా ఉండటంతోనే ..నేతలంతా ఇలా ముందు చూపుతో పక్క పార్టీలకు వెళుతున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE