ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. దేశవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 45 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను బీజేపీ 9 వేల పవర్ సెంటర్లుగా వర్గీకరించి వాటికి ఇన్ఛార్జ్లను నియమించింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమ, మంగళవారాల్లో ఏపీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా వారితో ముచ్చటించేందుకు సోమవారం విజయవాడలోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాల మైదానంలో జరిగిన శక్తి కేంద్రాల ఇన్ఛార్జ్ల సమావేశంలో పాల్గొన్నారు.
ఇన్చార్జ్ల సమావేశంలో నడ్డా ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో మార్పు కోసం మనం ప్రతి ఇంటి తలుపు తట్టాలని, దీనికి ముందుగా ఏపీలో ప్రతి కార్యకర్తా తమ ఇంటిపై బీజేపీ జెండా ఎగురవేయాలని పేర్కొన్నారు. ఏపీలో పది వేలకు పైగా శక్తి కేంద్రాలున్నాయని, ప్రతి బూత్ కమిటీలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. అలాగే కమిటీల ఏర్పాటు ప్రక్రియ నెలలో పూర్తి కావాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై బూత్ స్థాయిలో ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్’ నిధి కింద రైతులకు యేటా రూ. 6 వేలు వారి ఖాతాల్లో నేరుగా వేస్తున్నామని, ఇంకా ‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద రూ. 5 లక్షల వరకు వైద్య సహాయాన్ని అందిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని కోరారు.
అయితే ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం సీఎం జగన్ పెట్టిన స్కీం కాదని, ‘ఆయుష్మాన్ భారత్’ పేరుతో ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకానికి పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆయుష్మాన్ భారత్ దేశంలో ఎక్కడికెళ్లినా వర్తిస్తుందని, కానీ ఆరోగ్యశ్రీ పథకం ఏపీ దాటితే పనిచేయదని అన్నారు. ఇక కార్యక్రమం తర్వాత సాయంత్రం 5 గంటలకు వెన్యూ ఫంక్షన్ హాల్ లో విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాల పార్టీ ప్రముఖులతో సమావేశం కానున్నారు. అనంతరం రాత్రి బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై చర్చించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF