విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞం బుధవారంతో ముగిసింది. ఈ యజ్ఞం ముగింపులో భాగంగా ఈరోజు అఖండ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పాంచరాత్ర యాగశాలలో పూర్ణాహుతికి వెళ్తూ ఆయన, మార్గ మధ్యలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పాదాలను మొక్కి ఆశీర్వచనం తీసుకున్నారు. ఇక సీఎం జగన్ వెంట వచ్చిన భద్రతా సిబ్బంది నీలం రంగు పంచెలతో యాగశాలలోకి ప్రవేశించడం విశేషం. కాగా ఈ కార్యక్రమంలో శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి, అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ, మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికై ఈనెల 12 నుంచి అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మహాయజ్ఞం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు సీఎం జగన్ యజ్ఞ సంకల్పం తీసుకున్న అనంతరం మహాయజ్ఞం మొదలైంది. గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్.. కపిల గోవుకు హారతి ఇచ్చారు. ఆ తర్వాత అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. ఇక వారం రోజుల పాటు ఎంతో వైభంగా జరిగిన ఈ యజ్ఞంలో.. వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం తదితర ఆగమాలతో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లోని మొత్తం 108 కుండాలతో అనేక రకాల క్రతువులు నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మరలా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు యజ్ఞం చేశారు. కాగా యజ్ఞం తొలిరోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, 13న ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, 14న అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి, 15న శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, 16న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE