ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మాటల తూటాలతో, కోడిగుడ్డు, పప్పుల బహుమానాల పేరుతో రంజుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందురు కలిసి వచ్చినా సిద్ధం అంటూ ఊరూరా తిరుగుతున్నారు. ప్రజల్లోనే నిత్యం ఉండేలా ప్రణాళికలు రచించారు. ఫ్యాను ఇంట్లో ఉండాలి.. సైకిలు ఇంటి బయట ఉండాలి.. టీ గ్లాసు డస్ట్ బిన్ లో ఉండాలంటూ వైసీపీ శ్రేణులను హుషారెత్తించే వ్యాఖ్యలతో ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో సిద్ధం బహిరంగ సభలు ముగిశాయి. విశాఖపట్నం జిల్లా భీమిలీలో నిర్వహించిన సభ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు. క్యాడర్లో ఎన్నికల ఊపును తీసుకొచ్చారు.
దూకుడు మరింత పెంచేందుకు సిద్ధం అవుతున్నారు వైఎస్ జగన్. తెలుగుదేశం కంచుకోటలను కూడా కొల్లగొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి ఇలాకాలోనూ ఢీకొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ రికార్డు స్థాయిలో సీట్లు సాధించింది. కుప్పం నియోజకవర్గంలోనూ సత్తా చాటడడం అప్పట్లో సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుప్పం నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటామని అప్పట్లో వైసీపీ నేతలు సవాల్ విసిరారు. ఆ తర్వాత కూడా 175కు 175 అంటూ వైసీపీ పల్లవి అందుకుంది. టీడీపీ – జనసేన పొత్తు తర్వాత కూటమి ప్రాభవం పెరగింది. అయినప్పటికీ సిద్ధం పేరుతో జగన్ జనాల్లో తిరగడం మొదలుపెట్టిన నాటి నుంచీ అధికార పార్టీ మళ్లీ పుంజుకుంటోంది.
ఇదే ఊపులో చంద్రబాబు నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలోనూ భారీ స్థాయిలో సభకు వైసీపీ సిద్ధంఅవుతోంది. ఈ నెల 26 వ తేదీన జగన్ ఆ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈసభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైసీపీ అధిక సంఖ్యలో జనసమీకరణకు ప్లాన్ చేస్తోంది. కుప్పం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న హంద్రీ-నీవా జలాలను జగన్ ఈ పట్టణానికి విడుదల చేయనున్నారు. కుప్పం వాసుల కలను సాకారం చేయనున్నారు. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రాణం పోసుకున్న ప్రాజెక్ట్ ఇది. కుప్పానికి హంద్రీ-నీవా నీటిని ఇవ్వడానికి ఉద్దేశించిన డీపీఆర్ను వైఎస్సార్ ప్రభుత్వం ఆమోదించింది. పెద్ద తిప్పసముద్రం నుంచి కుప్పం వరకు పుంగనూరు బ్రాంచి కెనాల్ను నిర్మించేలా డీపీఆర్ను రూపొందించింది. దీన్ని యథాతథంగా ఆమోదించింది.
పుంగనూరు బ్రాంచి కెనాల్ ద్వారా మంచినీరు, సాగునీటి కోసం అప్పట్లోనే 1,700 కోట్ల రూపాయలను నిధులను మంజూరు చేసింది వైఎస్సార్ సర్కార్. ఇందులో భాగంగా పలమనేరు, కుప్పం నియోజకవర్గాల గుండా ప్రత్యేకంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ను నిర్మించింది. దీనికోసం అదనంగా 418 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దశలవారీగా ఈ బ్రాంచ్ కెనాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఎన్నికల ముందు నాటికి ప్రారంభం అయ్యేలా సర్కారు ప్లాన్ చేసింది. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు.. తన సొంత నియోజకవర్గానికి హంద్రీ-నీవా జలాలను తరలించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పటినుంచో విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును జగన్ ప్రారంభించడం ద్వారా వైసీపీ మైలేజీ పెరగనుంది. సిద్ధం సభ ద్వారా జగన్ నియోజకవర్గంలోని సమస్యలను, చంద్రబాబు పూర్తిచేయని ప్రాజెక్టులను లేవనెత్తనున్నారు. పులివెందులకు నీళ్లు ఇచ్చింది తానేనని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ సర్కార్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్దం అవుతోంది. కుప్పంకు నీళ్లు అందించాలన్న దృఢ సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారంటూ ఎప్పటినుంచో వైసీపీ చెబుతోంది. ఇచ్చిన మాట ప్రకారం.. ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చి కుప్పం సభ ద్వారా చంద్రబాబుకు జగన్ సవాల్ విసరనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE