ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్డీఏ రద్దు చట్టంపై దాఖలైన పిటిషన్లపై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని తరలింపు విషయంలో గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఆదేశాలు ఈ రోజుతో ముగియనుండటంతో సెప్టెంబరు 21 వరకు స్టేటస్ కో గడువును పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పటివరకు రాజధాని అంశంపై యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను సెప్టెంబర్ 21 కి వాయిదా వేసింది.
ముందుగా రాజధాని అంశంపై దాఖలైన పలు పిటిషన్లను సెప్టెంబర్ 21 నుంచి రోజు వారీ విచారణ జరపడంపై న్యాయవాదులతో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం చర్చించింది. భౌతిక దూరం నిబంధనలను పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే స్టేటస్ కో అమల్లో ఉన్నప్పుడే విశాఖలో అతిథిగృహం నిర్మాణం తలపెట్టారని, పిటిషనర్ తరఫు సుప్రీంకోర్టు న్యాయవాది నితీశ్ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సెప్టెంబరు 10 లోగా కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu