ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సీట్ల పంపకాలకు వేళ కావడంతో ఆశించిన నియోజకవర్గం వస్తుందా.. లేదా అనే ఉత్కంఠ ఏర్పడింది. ఆయా పార్టీల్లో కీలక నేతల సీట్లపై కూడా డైలమా కొనసాగుతోంది. అధికార పార్టీ వైసీపీలో అంబటి రాంబాబు, కొడాలి నాని వంటి వారి సీటు విషయంలో ఇంకా క్లారిటీ రాకపోతే.. టీడీపీలో గంటా శ్రీనివాసరావు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన సీటు దక్కేలా లేదని స్వయంగా ఆయనే పార్టీ కార్యకర్తల వద్ద వాపోతున్నారు. అంతేకాకుండా, తనను విశాఖ జిల్లా నుంచి గెంటేస్తారా.. అని కీలక వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు ఉంది. ఆయన 1999లో రాజకీయాల్లో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి అక్కడ కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అనంతరం కిరణ్కుమార్రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం నాటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా 2014 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీకి వచ్చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై చంద్రబాబు కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీచేసి వైసీపీ గాలిలోనూ ఎమ్మెల్యేగా గెలిచారు.
పార్టీ అధికారంలోకి రాకపోవడంతో అంత యాక్టివ్ గా లేరు. ఆ తర్వాత.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సంచలనంగా మారారు. అయితే, ఆయన రాజీనామాపై స్పీకర్ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. తన రాజీనామాను ఆమోదించాలని 2022లో మరోసారి స్పీకర్కు లేఖ రాశారు. 2024 జనవరి 23న స్పీకర్ ఆమోదించినట్లు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. జగన్ తో భేటీ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. రేపో, మాపో అంటూ కొన్ని ముహూర్తాలు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, వైసీపీలో చేరలేదు. టీడీపీలోనే కొనసాగుతున్నట్లుగా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయడం ఖాయమని తేలింది.
ఇప్పుడు తాజాగా రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలను గమనిస్తే.. ఆయన ఆశించిన సీటు డౌటే అని పార్టీ అధిష్ఠానం చెప్పినట్లుగా స్పష్టం అవుతోంది. ”గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నేను భావిస్తున్నాను. కానీ పార్టీ అధిష్టానం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని సూచించింది. అక్కడి నుంచి పోటీచేయడంపై ఆలోచిస్తున్నాను. ఇప్పటి వరకు నేను విశాఖ పరిధిలోనే పోటీ చేశాను. చీపురుపల్లి పక్క జిల్లాలో ఉంది. దాదాపు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. అక్కడ పోటీ తనకు సరిపోతుందా? లేదా? అన్న విషయాన్ని కార్యకర్తలు, అభిమానులతో చర్చించి హైకమాండ్ కు నిర్ణయం చెబుతా” అని గంటా శ్రీనివాసరావు తాజాగా వ్యాఖ్యానించారు. వారం రోజుల్లో టీడీపీ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉందని, తనకు విశాఖ నుండి పోటీ చేయాలని ఉందని తెలిపారు. తనను ఈ జిల్లా నుంచి పంపేద్దాం అనుకుంటున్నారా? పార్టీ నాయకులకు నా అభిప్రాయం చెబుతాను.. అని గంటా వెల్లడించారు. ఈ క్రమంలో గంటా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.., టీడీపీలోనే ఉంటారా అనే చర్చలు మొదలయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE