ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పరిపాలన విభాగంలో వున్న వివిధ శాఖలకు తోడుగా, రాష్ట్రంలో కొత్తగా మరో ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నైపుణాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త పాలనా శాఖను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని డిసెంబర్ 9, సోమవారం నాడు ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పలు పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు, యువతకు నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ అంశాలను ఈ శాఖ పర్యవేక్షిస్తుంది. గతంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల పేరిట ఏర్పాటు చేసిన విభాగాన్ని ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వ శాఖలో విలీనం చేస్తునట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నైపుణాభివృద్ధి, శిక్షణ విభాగం శాఖ కోసం రాష్ట్ర స్థాయిలో కార్యదర్శి, అదనపు కార్యదర్శి, ఇతర సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికే 36 శాఖలుండగా, 37వ శాఖగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం అందుబాటులోకి వచ్చింది.
[subscribe]