ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉదయం 9 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. సమావేశాలు మొదలైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించారు. అరగంటకు పైగా జరిగిన బీఏసీ సమావేశంలో మొత్తం 7 పనిదినాల పాటు సభను నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు. శని, ఆది వారాలు రెండ్రోజులు అసెంబ్లీకి సెలవుగా నిర్ణయించడంతో డిసెంబర్ 9,10,11,12,13,16,17 తేదీలలో ఈ సమావేశాలు జరగనున్నాయి.
ఏపీ అసెంబ్లీ ఫస్ట్ డే హైలైట్స్:
- ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రశ్నకు సమాధానమిస్తూ వాటిని అత్యున్నత కమిటీ సమీక్ష చేస్తోందని చెప్పారు.
- డీఎస్సీ నోటిఫికేషన్లపై అడిగిన ప్రశ్నకు మంత్రి ఆదిమూలపు సురేష్ సమాధానమిస్తూ, 2020 జనవరిలో 7900 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు.
- ప్రతిపక్ష నేత నా పక్కన నిలబడితే నేనేం మాట్లాడగలను, దయచేసి నా సీటు మార్చండంటూ ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు చేసినపుడు సీఎం జగన్, అధికార పార్టీ సభ్యులు నవ్వుతూనే ఉన్నారు.
- రాష్ట్రంలో మహిళల భద్రతపై అసెంబ్లీలో హోం మంత్రి సుచరిత ప్రసంగించారు. ఆమె ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.
- రాష్ట్రంలో ఉల్లి పాయల ధరలపై చర్చించాలని టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ అంశంపై సభలో చాలా సేపు గందరగోళం నెలకుంది.
- ఈ అంశంపై బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ గిఫ్ట్ ప్యాకెట్ లో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఉల్లిపాయల పంపించి అవమానించారని విమర్శించారు.
- ఉల్లిధరలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బజార్లలో రూ.25 కే కిలో ఉల్లిపాయలు ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ షాపులలో కిలో ఉల్లిని రూ.200కు అమ్ముతూ, వీళ్లు ప్రజల కష్టాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
- ఉల్లి సమస్య లేకుండా చేయడానికి ఇప్పటివరకు 36 వేల 536 క్వింటాళ్ల ఉల్లిపాయలను ఇతర రాష్ట్రాలను నుంచి కొనుగోలు చేసినట్లుు సీఎం తెలిపారు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళాంధ్రప్రదేశ్గా మారాలని ఎమ్మెల్యే రోజా అభిలాషించారు.
- మహిళల భద్రత అంశంపై మాట్లాడుతూ సినిమాల్లో న్యాయాన్ని చూసి తృప్తి పడాల్సిన పరిస్థితి ఆడవాళ్లకు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఆడ పిల్లకు కష్టం వస్తే గన్ వచ్చే కంటే ముందే జగన్ వచ్చి రక్షిస్తాడనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.
- అలాగే మహిళల రక్షణపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, తెలంగాణ సీఎం కేసీఆర్ కు హ్యాట్సాఫ్ చెప్పారు. హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన తనను కలచివేసిందన్నారు. దిశ కేసులో కాల్చిచంపినా తప్పులేదని తనకు కూడా అనిపించిందని అన్నారు.
- రాష్ట్రంలో మహిళల రక్షణకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని,వెంటనే న్యాయం జరగాలంటే చట్టాలను మార్చాల్సి ఉంటుందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
- ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కూడా మహిళల భద్రత అంశంపై మాట్లాడారు. నిర్భయ, దిశ సంఘటనలను ప్రస్తావిస్తూ ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయంకోసం చట్టాలు మార్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఏ చట్టాన్ని ఐనా సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
- గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ రోజు మొదలైన అసెంబ్లీలో టీడీపీకి సంబంధించిన గ్రూప్ లోనే కూర్చున్నారు. అయితే టీడీపీ సభ్యులకు కొంచెం పక్కగా వంశీ కూర్చోవడం విశేషం.
[subscribe]