జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు జనవరి 20, సోమవారం నాడు లేఖ రాశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యి పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా, ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుల్ని వ్యతిరేకించాలని ఆ లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
” ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని పార్టీలలోని వివిధ స్థాయిల్లో జరిగిన సమావేశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. రాజధాని నిర్మాణం అమరావతిలోనే కొనసాగాలని, ప్రభుత్వ పాలనా సంపూర్ణంగా అమరావతి నుంచే సాగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఈ సమావేశాలలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ రోజు జరగనున్న సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏపీ డిసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్ రీజియన్ యాక్ట్ 2020 మరియు అమరావతి మెట్రో డెవలప్మెంట్ యాక్ట్ 2020 ప్రవేశపెడుతున్నారు. పార్టీ నిర్ణయానుసారం మీరు శాసనసభకు హాజరై, ఈ రెండు బిల్లులు ప్రవేశపెట్టే సమయంలోనూ, ఓటింగ్ సమయంలనూ వ్యతిరేకించవలసిందిగా కోరుతున్నానని” లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మరోవైపు ఈ రోజు సాయంత్రం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జనసేన పి.ఏ.సీ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తుంది. రాజధాని అమరావతిపై పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, బీజేపీతో పొత్తు తర్వాత కలిసి పనిచేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
[subscribe]