ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే స్వేచ్ఛ పోస్టర్ ను సీఎం విడుదల చేశారు. మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రుతుక్రమ సమస్యలతో బాలికలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో స్వేచ్ఛ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ప్రభుత్వం నెలకు 10 చొప్పున శానిటరీ న్యాప్కిన్లు ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో చదివే 10 లక్షల మంది విద్యార్థునులకు ఏడాదికి 120 న్యాప్కిన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
‘స్వేచ్ఛ’ పథకం, న్యాప్కిన్లను డిస్పోజ్ చేసే పద్ధతులపై మహిళా టీచర్లు, ఏఎన్ఎంలు బాలికలకు అవగాహన కల్పించాలని, ఈ కార్యక్రమం అమలు కోసం నోడల్ అధికారిగా మహిళా టీచర్ను నియమించాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత స్టోర్లలో నాణ్యమైన న్యాప్కిన్స్ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ