తెలుగుదేశం పార్టీకి ఏపీ రాజకీయ సమీకరణాలు కలిసొస్తున్నాయి. ఇప్పటికే జనసేన జట్టుకట్టడంతో ఆ పార్టీకి కాస్త బలం పెరిగింది. బీజేపీ కూడా అటూ.. ఇటూ వీరికే మద్దతు ఇచ్చేలా ఉంది. ఆయా పార్టీల సంగతి అటుంచితే.. కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల.. కలిసి పోరాడదాం అంటూ టీడీపీ జనసేన కూటమికి వంతు పాడడం మరింత ఆసక్తిగా మారింది. వైఎస్ కుటుంబ తగాదాలు.. రాజకీయంగా టీడీపీకి కలిసొచ్చేలా మారాయి. షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నప్పుడే.. ఆమెను వెళ్లగొట్టారంటూ టీడీపీ రాజకీయ ప్రచారంగా వినియోగించుకుంది. ఇప్పుడు ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో పాటు.. అన్న వ్యతిరేక పార్టీలతో కలిసి పోరాడేందుకు సిద్ధం కావడం మరింత ఆసక్తిగా మారింది.
ఈక్రమంలోనే టీడీపీ నాయకుల ప్రచారశైలిని గమనిస్తే.. వారికి జగన్ చెల్లెలు అండ పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానించడానికి ఆమె స్వయంగా చంద్రబాబునాయుడిని కలిశారు. చాలాసేపు ఇద్దరూ వర్తమాన రాజకీయాలపై చర్చించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కలిసి పోరాడదాం.. అంటూ షర్మిల టీడీపీ, జనసేనకు లేఖ రాశారు. దానిపై ఇప్పటి వరకు ఆ పార్టీలు బహిరంగంగా స్పందించలేదు. కానీ.. ప్రచారంలో జగన్ పై ఎక్కుపెడుతున్న విమర్శలను గమనిస్తే.. టీడీపీ కూటమికి షర్మిల సహకారం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
‘శంఖారావం’ పేరుతో ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ జగన్ పై తీవ్రమైన స్థాయిలో ధ్వజమెత్తారు. మోసానికి ప్యాంటు, షర్టు వేస్తే అది జగన్రెడ్డేనని అన్నారు. పాదయాత్రలో ప్రతి మహిళకు ముద్దులు పెట్టారని.. తర్వాత గుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. జాబ్ కేలెండర్ కాస్తా.. ఆయన పత్రిక కేలెండర్లా మారిందని ఎద్దేవాచేశారు. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి జగన్రెడ్డి భూములు కేటాయించలేదని.. కనీసం ఒక్క పరిశ్రమను కూడా ఉత్తరాంధ్రకు తీసుకురాలేదని ఆక్షేపించారు. రూ.500 కోట్లతో విశాఖ రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్నాడని.. రేపు ఆ ప్యాలెస్ను ప్రజల కోసం ఉపయోగించే బాధ్యత టీడీపీ-జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. టీడీపీ తీసుకొచ్చిన వంద సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈయనే. చంద్రబాబు, పవన్ కలిసి ‘సూపర్సిక్స్’ రూపొందించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తాం. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తాం. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తాం. మహిళలకు ఉచితంగా మూడు సిలెండర్లు ఇస్తాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తాం. ఐదేళ్లలో రూ.90 వేలు ఇస్తాం. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా కల్పిస్తామని చెప్పారు.
రాజకీయపరంగా విమర్శలు, పార్టీ హామీలు పక్కనపెడితే.. కుటుంబపరంగానూ జగన్ పై చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. సొంత తల్లి, చెల్లే జగన్రెడ్డిని నమ్మడం లేదు. అధికారంలోకి వచ్చాక వారిని ఇంటి నుంచి గెంటేశాడు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే షర్మిలపై వైసీపీ పేటీఎం కుక్కలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయి. రెండు నెలలు ఆగండి. వారికి తగిన బుద్ధి చెబుతాం. సొంత చెల్లెళ్లకే రక్షణ కల్పించలేకపోతే రాష్ట్రంలోని మహిళలకు ఏం రక్షణ కల్పిస్తారు? అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు. షర్మిలపై విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులకు లోకేశ్ వార్నింగ్ ఇవ్వడం.. కుటుంబపరంగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. షర్మిలకు కూటమి, కూటమికి షర్మిల లోపాయికారి మద్దతు ఉంటున్నట్లుగా తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY