రాజ్యసభ ఎన్నికల బరిలో తాము కూడా ఉన్నామని టీడీపీ చెబుతోంది. సరిపడా ఎమ్మెల్యేలు లేకపోయినా అనూహ్యంగా ఏదైనా జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు .ముఖ్యంగా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై ఆశలు పెట్టుకున్న తెలుగు దేశం పార్టీ.. తమకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెబుతోంది. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవడంతో ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.
ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ పదవీకాలం ముగిసిపోనుంది. ఇటు మొత్తం 175 ఎమ్మెల్యేల్లో ఇప్పటికే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు ఇటీవలే స్పీకర్ ఆమోదం తెలిపారు. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన నలుగురు ఎమ్మేల్యేలు, వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు జనసేన నుంచి వైసీపీకి వచ్చిన రాపాక వరప్రసాద్పై అనర్హత వేటుపై అతి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పది మందిని పక్కన పెడితే మిగిలిన 165 మంది ఎమ్మెల్యేలో.. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి విజయానికి 41 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. దీంతో సంఖ్యాపరంగా ఈ మూడు స్థానాలనూ తామే కైవసం చేసుకుంటామని వైసీపీ ధీమాగా చెబుతూ వస్తోంది
అయితే గతంలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున పంచుమర్తి అనురాధ గెలిచారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు టీడీపీకి అనుకూలంగా ఓటెయ్యడంతో అప్పుడు అధికార పార్టీ కంగుతింది. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఉండవల్లి శ్రీదేవి కూడా టీడీపీకి దగ్గరయ్యారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే..ఎమ్మెల్సీ ఎన్నికలో జరిగినట్లుగా మరోసారి జరగకూడదని వైసీపీ జాగ్రత్త పడుతోంది.
రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేయడానికి పది మంది ఎమ్మెల్యేల మద్దతుంటే సరిపోతుంది. దీంతో టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలాగే రాజ్యసభ ఎన్నికల్లోనూ అనూహ్య గెలుపును చంద్రబాబు ఆశిస్తున్నారు. వైసీపీలో సీట్లు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేల ఓట్లతో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో గెలవచ్చంటూ చంద్రబాబు అంచనా వేస్తున్నారు. దీనికి తగినట్లే టీడీపీ తరపున అభ్యర్థిని నిలపాలని వైసీపీ ఎమ్మెల్యేలే కోరారని.. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల కోసం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, టీడీఎల్పీ ఎలక్షన్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్, మరో మాజీ రాజ్యసభ ఎంపీ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ