ఫిబ్రవరి 27న 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే హిమాచల్ ప్రదేశ్లో ఒకే ఒక్క రాజ్యసభ సీటుకు జరిగే ఎన్నిక పైనే అందరి చూపు ఇక్కడే పడింది. హిమాచల్ ప్రదేశ్లోని రాజ్యసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ రాజ్యసభకు పంపడంపై హస్తం పెద్దలు చర్చిస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సిమ్లా పర్యటన ఫిబ్రవరి నెలలో ఉండటంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది.
రాజ్యసభ ఎన్నికల కోసం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో చర్చిస్తామని తాజాగా హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ సిమ్లాలో చెప్పారు. వాళ్లు కోరుకుంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తామని చెప్పారు. సోనియా గాంధీ ప్రస్తుతం రాయ్బరేలీ ఎంపీగా ఉండగా.. ప్రియాంక గాంధీ ఇంకా పార్లమెంటు సభ్యురాలు కాలేదు. ఆమె ఇప్పటి వరకూ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజ్యసభకు నామినేట్ కాలేదు.
హిమాచల్ ప్రదేశ్లో 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో ప్రియాంక కీలక పాత్ర పోషించారు. ప్రియాంక గాంధీకి సిమ్లాలోని ఛరాబ్రాలో సొంత ఇల్లు కూడా ఉంది. దీంతోనే ప్రియాకం రాజ్యసభకు వెళ్లడంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రియాంకతో పాటు రాజ్యసభ ఎంపీలుగా కాంగ్రెస్ నుంచి బిప్లవ్ ఠాకూర్, ఆనంద్ శర్మ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ఇంతకు ముందు రాజ్యసభ ఎంపీలుగా ఉండటంతో పాటు.. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుకు సన్నిహతులు.
హిమాచల్ ప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డాతో పాటు ఇందు గోస్వామి, ప్రొ. సికందర్ కుమార్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 2018లో జగత్ ప్రకాష్ నడ్డా రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో హిమాచల్ ప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తోంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ 40 సీట్లతో మెజారిటీ సాధించడంతో పాటు..మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా కాంగ్రెస్కే ఉంది. 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో.. బీజేపీకి మొత్తం 25 సీట్లు ఉన్నాయి.
ఫిబ్రవరి 27న 56 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగడమే కాదు..అదే రోజు ఫలితాలు కూడా వచ్చేస్తాయి. దీనికోసం ఫిబ్రవరి 8న ఎన్నికలకు కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినేషన్కు ఆఖరు తేదీ ఫిబ్రవరి 15. అయితే లోక్సభ ఎన్నికలకు పార్టీలన్నీ రెడీ అవుతుండగా.. రాజ్యసభ ఎన్నికలను ప్రకటించింది ఈసీ. దీంతో రాజ్యసభ ఎన్నికలనే ఇప్పుడు అన్ని పార్టీలు అత్యంత కీలకంగా పరిగణిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ నుంచి ప్రియాంక పేరు తెరమీదకు వచ్చింది
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ